సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, వాటర్ వర్క్స్, ఆర్అండ్బీ, ఆర్టీఏ విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు. నగరంలోని రోడ్డు ప్రమాదాల కారణాలను ఈ గ్రూప్ విశ్లేషిస్తుంది. ప్రస్తుతం నగరంలో 65 బ్లాక్ స్పాట్లున్నట్లు పోలీసులు గుర్తించారు. మానవ తప్పిదాల వల్లనే 98 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో వ్యక్తిగతంగా ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య 95 శాతం వరకు ఉంటుంది. ఇది ఇతర వాహనదారులను ప్రమాదాల బారిన పడేస్తున్నది. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్లతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి దాటిన తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ చేస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కనీసం 10 శాతం రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో నగర ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదాలు జరగడానికి వాహనదారుడు, పాదచారుల వ్యక్తిగత కారణాలు ఒకటైతే, మరో పక్క రోడ్డు ఇంజినీరింగ్, విద్యుత్ స్తంభాలు, బస్స్టాప్లు, డివైడర్లు, సూచక బోర్డులు ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరుగగానే అన్ని విభాగాలు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలన చేస్తాయి. అక్కడ ఏ డిపార్టుమెంట్ సమస్య ఉందనే విషయాన్ని గుర్తిస్తారు. అలా గుర్తించిన వెంటనే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరించవచ్చనే అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ తాత్కాలికంగా, కొద్ది సమయం తీసుకొని పరిష్కరించేది, సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టే విషయాలపై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారు.
అర్ధరాత్రి తరువాతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్లో ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ ్రడ్రైవ్లను తగ్గించడం కోసం సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) చేస్తూనే, అర్ధరాత్రి సమయాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల పరిసరాలలో ఎక్కువగా ఈ డ్రైవ్ కొనసాగుతున్నది.
స్వతహాగా చేసే పొరపాట్లతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించిన వారు ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు నడుపొద్దు. డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలి. క్యాబ్లపై వెళ్లడం చేయాలి. అర్ధరాత్రి వేళల్లో ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాం.
– సుధీర్బాబు, ట్రాఫిక్ అదనపు సీపీ