Hyderabad | సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : దేశీయ మెట్రో నగరాల గృహ నిర్మాణంలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు… మరోవైపు అధిక బడ్జెట్తో కూడిన ప్రాజెక్టులను చేపట్టడంలోనూ హైదరాబాద్ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2018 నుంచి 2022 వరకు దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ అనరాక్ ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని మొత్తం 7 మెట్రో నగరాల్లో గృహ నిర్మాణ రంగం ఎంతో వృద్ధి రేటును నమోదు చేసిందని, 2022 సంత్సరం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక మైలురాయి వంటిదని పేర్కొంది. 2018లో హైదరాబాద్ మహానగరంలో కొత్త ప్రాజెక్టులు 17,300 ప్రారంభమైతే, 2022లో 68,000 ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభమయ్యాయని పేర్కొంది. అదేవిధంగా విక్రయాల పరంగా చూస్తే 2018లో 18,600 అమ్మకాలు జరిగితే, 2022లో 47,500 విక్రయాలు జరిగాయి.
ప్రస్తుత ఏడాది హైదరాబాద్లో సానుకూలమైన ట్రెండ్ కొనసాగుతుందని, గృహనిర్మాణ రంగం విభాగంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, విక్రయాల్లో పెరుగుదల మెరుగ్గా ఉంటుందని అనరాక్ అంచనా వేసింది. ముఖ్యంగా నగరంలోని వెస్ట్ జోన్లో ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల జోరుతో మార్కెట్ పరుగులు పెడుతుంటే, దానికి ప్రభుత్వం మరింత మేలు చేసేలా నగరానికి ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాల విస్తరణ కోసం తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీ మరింత దోహదం చేస్తుందని పేర్కొన్నది. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కి.మీ మేర నిర్మించే మెట్రో ప్రాజెక్టుతో గృహ నిర్మాణ రంగంలో వృద్ధికి మరింత జోష్ను ఇస్తుందని ఆనరాక్ నివేదికలో పేర్కొన్నది.
ఆర్థిక వ్యవస్థ, వేగంగా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుండడంతో నగరంలో నివాస గృహాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపినా, హైదరాబాద్పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. కరోనా తర్వాత నుంచే మరింత పెరుగుదలగా గృహ నిర్మాణ విభాగం కనిపించిందని ఆనరాక్ తన నివేదికలో పేర్కొంది. వ్యాపార అనుకూలత, తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. 2018 నుంచి 2022 వరకు గృహ వినియోగ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో 293 శాతం పెరుగుదల నమోదైంది. అదేవిధంగా విక్రయాల్లో 155 శాతం నమోదైనట్లు ఆనరాక్ నివేదికలో పేర్కొన్నారు.