Vande Bharat | సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య జోరుగా నడుస్తున్న వందేభారత్ వీలైనంత త్వరలోనే హైదరాబాద్-నాగ్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు ఐదు నుంచి ఆరు గంటల్లోనే నాగ్పూర్-సికింద్రాబాద్ రాకపోకలను సాగించే అవకాశం ఉంటుందన్నారు.
ఇప్పటికే రాష్ట్రం నుంచి కాచిగూడ- పుణే, హైదరాబాద్-బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లను నడుపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో సాఫ్ట్వేర్, రియల్ఎస్టేట్ రంగాలతో పాటు ఫార్మా, ఉత్పాదక, రీసెర్చ్, వస్త్ర, వ్యాపారాలు వంటి అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు విద్యా, వ్యాపార, ఐటీ హబ్గా మారాయి. దీంతో దేశంలో నలుమూలల నుంచి హైదరాబాద్కు ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ వస్తున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.