సిగరెట్, గంజాయి, కొకైన్, బ్రౌన్షుగర్, ఎల్ఎస్డీ, హాశిశ్ ఆయిల్.. ఇలా రకరకాల వ్యసనాలకు యువత చిత్తవుతోంది. సమాజాన్ని పెడదోవ పట్టించే ఈ మత్తు దందాను కూకటివేళ్లతో పెకిలించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దూకుడు పెంచారు. మత్తు పదార్థాల సరఫరా, అమ్మకం, వాడకంపై పటిష్ట నిఘా పెట్టడంతో దందా దారులు మూసుకుపోతున్నాయి. తాజాగా టాస్క్ఫోర్స్ పోలీసులు వారంరోజులపాటు రెక్కీ నిర్వహించి డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ ఫైవ్స్టార్ హోటల్లోని ఫుడింగ్ మింక్ పబ్లో నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 148 మందిని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు తరలించి విచారించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 : ‘గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలి. డ్రగ్స్ కంట్రోల్ విషయాల్లో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలవాలి. రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగంపై దృష్టి సారించాలి. అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్లు రద్దు చేయాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ను గుర్తించాలి. పబ్స్ యజమానులందరినీ పిలిపించి.. సమావేశం ఏర్పాటు చేసి వారికి కచ్చితమైన ఆదేశాలివ్వాలి. నేను తరచుగా ఎక్సైజ్శాఖపై సమీక్ష నిర్వహిస్తా..ఎటువంటి అలసత్వం లేకుండా అప్రమత్తతతో పనిచేయాలి’ ఇది ఈ ఏడాది జనవరి 28న ప్రగతి భవన్లో పోలీస్, ఎక్సైజ్శాఖ అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. అందుకు తగ్గట్టుగానే అప్పటి నుంచి అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మత్తు ముఠాలపై దాడులు పెంచారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం డ్రగ్ మాఫియాపై యుద్ధం ప్రకటించింది. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశించడంతో రాజకీయ ఒత్తిళ్లు తగ్గాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మరింత స్వేచ్ఛగా డ్రగ్స్ ముఠాలపై ముప్పేట దాడులు చేస్తున్నారు. ఫలితంగానే అనేక సంచలన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో రాజకీయ ఒత్తిళ్లలో ఈ తరహా కేసులు తొక్కిపెట్టేవారని, సెలబ్రిటీలు ఉంటే చూసీచూడనట్టు వ్యవహరించేవారమని దర్యాప్తు విభాగాల అధికారులే ఆఫ్ది రికార్డు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఏకంగా బడాబాబులను సైతం తప్పుచేస్తే ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.
‘మత్తు’పై ముప్పేట దాడి..
ప్రత్యేక సాఫ్ట్వేర్తో పెరిగిన సమన్వయం..
డ్రగ్స్ మాఫియాను తుదముట్టించడంలో సాంకేతికంగా కూడా తెలంగాణ పోలీసులు ముందడుగు వేశారు. డ్రగ్స్ సరఫరా కేవలం మన రాష్ట్ర పరిధిలోని అంశం కాదు కాబట్టి ఎక్కడి నుంచి తరలిస్తున్నారన్నది గుర్తించి ఆయా రాష్ర్టాల మధ్య సమన్వయం పెంచేలా డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టంను రూపొందించారు. ఇందులో డ్రగ్స్ కేసులో పట్టుబడే పాత నేరస్తులు తాజాగా పట్టుబడుతున్న వారి వివరాలు నమోదు చేయడం ద్వారా డేటా బేస్ను రూపొందిస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ర్టాలతోనూ సమన్వయం మరింత పెరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల్లో నిఘా పటిష్టం చేశారు.
కొత్త కోణాలు వెలుగులోకి..
మత్తుపదార్థం అంటే గతంలో గంజాయి మాత్రమే ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పుడు అది అనేక రూపాల్లో ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నది. గతంలో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ డ్రగ్స్ గబ్బు ఇప్పుడు ఇతర వర్గాలకు పాకింది. సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే యువత ఒత్తిడి తట్టుకునేందుకు ఈ డ్రగ్స్ వైపు చూస్తున్నట్టు కొన్ని ఘటనలు చెబుతున్నాయి.
ఎవర్నీ వదిలేది లేదు..
ప్రభుత్వ ఆదేశాలతో నగరంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ సమాచారం పిల్లల తల్లిదండ్రులు, సామాన్యుల నుంచే వస్తున్నది. బంజారాహిల్స్ ఫుడింగ్ మింక్ పబ్ ఘటనపై సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. ఈ పబ్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే నెట్వర్క్ను ఛేదిస్తాం. ఆధారాలు లభిస్తే ఎవరినీ వదిలిపెట్టం.
– సీవీ ఆనంద్, నగర పోలీసు కమిషనర్