సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్ : శంషాబాద్లో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు శంషాబాద్ ఎస్వోటీ, శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. అప్పు ఇచ్చిన పాపానికి మహిళను ప్రామిసరీ నోట్ రాసిస్తానని ఇంటికి పిలిపించి, కండ్లల్లో కారం చల్లి, గొంతుకు చీర కొంగుతో బిగించి హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. హతురాలు శంషాబాద్ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ దొడ్డికి చెందిన వడ్ల మంజుల(45)గా, హంతకురాలు రిజ్వానాబేగంగా పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతో నిర్ధారించారు. ఈ మేరకు శనివారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, శంషాబాద్ ఏసీపీ రామచందర్రావు, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణగౌడ్, ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
శంషాబాద్, ఇందిరానగర్ దొడ్డికి చెందిన వడ్ల మంజుల స్థానికంగా చిన్నపాటి వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నది. కాగా, నిజామాబాద్ జిల్లా శాతపూర్కు చెందిన షేక్ రిజ్వానా బేగం 2010లో బతుకుదెరువు కోసం శంషాబాద్కు వలస వచ్చి, ఎయిర్పోర్టులో పనికి చేరింది. 2015లో తొండుపల్లికి చెందిన మహ్మద్ని వివాహం చేసుకున్నది. అయితే అప్పటికే మహ్మద్కు వివాహం జరగడంతో రిజ్వానా శంషాబాద్ ఇందిరానగర్దొడ్డి ప్రాంతంలో నివాసం ఉంటున్నది. 2017లో చేతికి గాయం కావడంతో ఎయిర్పోర్ట్లో పని మానేసిన రిజ్వానా బేగం దాదాపు 4 ఏండ్లపాటు చీర ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ జీవనం సాగించింది. రెండేండ్ల కిందట ఇందిరానగర్ దొడ్డి ప్రాంతంలో కేజీఎల్ లేడీస్ కార్నర్ను ప్రారంభించింది. అదే షాపులో భాగంగా పెట్రోల్ కూడా విక్రయించేది. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే మంజులతో పరిచయం ఏర్పడింది. రిజ్వాన తరచూ మంజుల ఇంటికి రాకపోకలు సాగించేది. అయితే తన సోదరి వివాహం కోసమని మంజుల వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని, వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. దీంతో రిజ్వానపై మంజులకు నమ్మకం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుని 2022లో మరో రూ.50వేలను రిజ్వాన అప్పుగా తీసుకున్నది. కానీ అప్పటికే రిజ్వానకు భర్తతో గొడవలు కావడం, దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో మంజుల వద్ద తీసుకున్న రూ.50వేలకు వడ్డీతోపాటు అసలు చెల్లించడం ఇబ్బందిగా మారింది.
ఏదో ఒక సాకు చెప్పి రోజులు వెల్లదీస్తున్న రిజ్వానా బేగం ఈనెల 9న మరో రూ.50వేలు అప్పు ఇవ్వాలని, గతంలో తీసుకున్న రూ.50 వేలతోపాటు ఇప్పుడిచ్చే రూ.50వేలు కలిపి లక్ష రూపాయలు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని నమ్మబలికింది. ఆమెను నమ్మిన మంజుల మరో రూ.50వేలు అప్పుగా ఇచ్చింది. అయితే ఈ రెండింటికి కలిపి లక్ష రూపాయలకు ప్రామిసరీ నోట్ రాసి ఇస్తా.. ఇంటికి రావాలని రిజ్వానాబేగం అప్పు ఇచ్చిన మంజులను కోరింది. అది నమ్మిన మంజుల ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో రిజ్వానా బేగం ఇంటికి వచ్చింది. అప్పటికే మంజులను హతమార్చేందుకు పథకం వేసుకున్న రిజ్వాన ఇంట్లోకి వచ్చిన మంజుల కండ్లల్లో కారం చల్లి, ఆమె చీర కొంగుతోనే మెడకు గట్టిగా బిగించి ఉరివేసి హత్య చేసింది. అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని, మృతదేహాన్ని ఫ్లోర్ మ్యాట్లో చుట్టేసింది. అనంతరం ఇంటికి తాళం వేసి మృతదేహంపై నుంచి తీసుకున్న బంగారు నగలను తీసుకుని శంషాబాద్ ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రూ.83వేల నగదు తీసుకున్నది. అనంతరం ఇంటికి వెళ్లకుండా కొత్తూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుని ఈ నెల 11వ తేదీన ఉదయం ఎప్పటిలాగే ఇందిరానగర్ దొడ్డిలో ఉన్న తన షాప్నకు వచ్చింది.
సాయంత్రం 5.30గంటల సమయంలో స్కూటీ తీసుకుని శంషాబాద్కు వెళ్లి తన భర్తకు ఫోన్చేసి షాపింగ్ చేద్దామని పిలిపించింది. భర్త షేక్ మహ్మద్ కారు తీసుకుని రావడంతో తన స్కూటీని శంషాబాద్ వద్దనే పార్క్ చేసిన రిజ్వాన భర్తతో కలిసి కారులో వెళ్లి, చార్మినార్ ప్రాంతంలో షాపింగ్ చేసింది. అజ్మీర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసినట్లు భర్తకు తెలిపింది. అనంతరం భర్తతో కలిసి శంషాబాద్ వచ్చిన రిజ్వాన అక్కడ కారు దిగి తన స్కూటీతో ఇందిరానగర్ దొడ్డిలోని తన ఇంటికి చేరుకున్నది. ఇంట్లో ఫ్లోర్ మ్యాట్లో చుట్టి ఉన్న మృతదేహాన్ని రాత్రి 12 గంటల సమయంలో మొదటి అంతస్తు పైనుంచి కిందకు తోసేసింది. తన దుకాణంలో ఉన్న పెట్రోల్ తీసుకువచ్చి మృతదేహాన్ని తగులబెట్టింది.
తరచూ వేధిస్తున్న తన భర్తనే చంపుదామనుకున్నట్లు నిందితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. తనను రెండో వివాహం చేసుకున్న భర్త షేక్ మహ్మద్ తరచూ వేధింపులకు గురిచేయడం, తనను పట్టించుకోకపోవడం, డబ్బులు అడగడం చేస్తుండేవాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు రిజ్వానాబేగం పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ గొడవల్లో భాగంగా ఒకసారి భర్త షేక్ మహ్మద్ తన తలపై బలంగా కొట్టాడని, ఆ సమయంలోనే అతడిని హతమార్చాలనుకున్నట్లు తెలిపింది. అయితే అది సాధ్యపడలేదని పోలీసుల విచారణలో వెల్లడించింది.
ఈనెల 11న రాత్రి 12.40 గంటల సమయంలో శంషాబాద్ పట్టణంలోని శ్రీనివాస ఎన్క్లేవ్లో నివాసముండే సూరజ్రావు అనే యువకుడు డీటీడీసీ కొరియర్లో పనిచేసి డ్యూటీ ముగించుకొని తన గదికి వచ్చే సమయంలో ఇంటి పక్కనే మంటలు రావడం గమనించాడు. వెంటనే విషయాన్ని తోటి ఉద్యోగి జీవన్ తపాకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న మరో వ్యక్తి లలిత్ ప్రధాన్ దగ్గరికి వెళ్లి చూడగా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాలిపోతున్నట్లు గుర్తించారు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన మృతదేహం వద్ద కాలి మట్టెలు, తాళం చెవులు లభించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తుండగా.. శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో మంజుల అదృశ్యమైనట్లు మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో పోలీసులు మంజుల భర్త లక్ష్మయ్యను పిలిపించి ఉస్మానియా మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపించగా.. అది తన భార్య మంజులదిగా గుర్తించారు. వివరాలు సేకరించిన పోలీసులు సీసీ కెమెరా, ఇతర టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి, హత్యకు పాల్పడింది రిజ్వానాగా గుర్తించారు. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది.