వికారాబాద్, మే 6, (నమస్తే తెలంగాణ): కొవిడ్ లక్షణాలను ఉన్నవారిని గుర్తించి ఆదిలోనే వ్యాప్తిని కట్టడి చేసేందుకు వికారాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం జిల్లావ్యాప్తంగా 661 బృందాలతో ఇంటింటి సర్వే చేపడుతున్నది. గ్రామ పంచాయతీ కార్యదర్శి, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లను బృందాలుగా నియమించారు. వీరు ఇంటింటికీ వెళ్లి కొవిడ్ సోకిన, లక్షణాలు ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. అవసరమైనవారికి మందులు ఇచ్చి హోం క్వారంటైన్ చేస్తున్నారు. కొవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వ దవాఖానలకు జనం పరుగులు తీస్తుండడంతో రద్దీ పెరిగి వైరస్ వ్యాప్తి అధికమవుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు, తీవ్ర సమస్య ఉన్నవారికి అక్కడికక్కడే కొవిడ్ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో 566 గ్రామ పంచాయతీల పరిధిలో 1,83,980 ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 7,67,134 పైగా జనాభా ఉన్నది. మూడు రోజుల పాటు జిల్లాలో ఈ సర్వే జరుగనున్నది. ఒక్కో బృందం 500 కుటుంబాలను సర్వే చేయనున్నారు. సర్వేకు సంబంధించి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనగుణంగా సర్వే చేపట్టాలని ఆదేశించారు.
లెక్క పక్కాగా..
ఈ సర్వేతో కొవిడ్ లక్షణాలు ఉన్నవారి లెక్క ఇక పక్కాగా ఉండనున్నది. ఇప్పటివరకు పాజిటివ్గా తేలినవారి లెక్కలు మాత్రమే అధికారుల వద్ద ఉన్నాయి. కరోనా వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ టెస్టులు చేయించుకోకపోవడంవల్ల వారు పాజిటివ్ రికార్డుల్లోకి రావడం లేదు. దీంతో వారు బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. కొంతమందికి స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ సీజనల్ వ్యాధులంటూ బుకాయిస్తూ యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతమందికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయి.. అని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతున్నది. దీంతో కరోనా సోకినవారి లెక్క తేలడంతోపాటు మరింత మెరుగ్గా వైద్యసేవలు అందించేందుకు వీలు కలుగుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.