బంజారాహిల్స్, నవంబర్ 27: బంగారు నగలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. ఈ గ్యాంగ్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. లభించిన ప్రాథమిక సమాచారం, ఆధారాలతో గతంలో హైదరాబాద్లో పట్టుబడిన ఇతర రాష్ర్టాల నేరగాళ్ల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న లాడ్జీలపై కూడా పోలీసులు నిఘా పెంచారు. బంగారు నగలను టార్గెట్ చేసుకున్న దుండగులు.. జూబ్లీహిల్స్, నారాయణగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో తమ చేతి వాటాన్ని చూపించిన విషయం తెలిసిందే.
పంజాగుట్టలోని కృష్ణా జువెలర్స్ యజమాని నివాసం జూబ్లీహిల్స్లో ఉంది. ఈనెల 22న రాత్రి దుకాణం మూసిన తర్వాత.. అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న ఆనంద్ తాళాలకు సంబంధించిన బ్యాగును తీసుకొని, ద్విచక్ర వాహనంపై యజమాని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న అతడు తన వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న సమయంలో మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఆనంద్ కంట్లో కారం కొట్టి బ్యాగును తీసుకొని ఉడాయించారు. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. మరుసటి రోజు ఉదయం ఆ బ్యాగు జువెలర్స్ షాపు సమీపంలో దొరికింది. అందులో తాళాలు మాత్రమే ఉండటంతో దుండగులు పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ సంఘటన తర్వాత ఇదే తరహాలో నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో కూడా ఓ దోపిడీ జరిగింది.
ఈనెల 24న నారాయణగూడ పరిధిలో కూడా ఓ ఆభరణాల షాపు నుంచి వెళ్తున్న ఉద్యోగి కళ్లలో కారం కొట్టిన దుండగులు 25 తులాల బంగారం ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. జూబ్లీహిల్స్, నారాయణగూడలో జరిగిన రెండు ఘటనలు ఒకే మాదిరిగా ఉండటం, నేరగాళ్లు కూడా ఒకే వయస్సు వారు కావడంతో.. ఈ రెండు నేరాల వెనుక ఒకే గ్యాంగ్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీలు ఒకే పద్ధతిలో జరగడంతో వీరు మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో దోపిడీలకు పాల్పడిన ఇతర రాష్ర్టాల గ్యాంగ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు. లాడ్జీలలో వీరు బసచేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.