సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): పాకిస్తాన్లోని ఉగ్రవాది ఘోరీ ఆదేశాలతో నగరంలో ఉగ్ర కుట్రకు పాల్పడ్డ నిందితులకు ఖలీమ్ రూ.10 లక్షల హవాలా సొమ్మును అందించాడు. హైదరాబాద్లో భారీ ఎత్తున హింస చెలరేగేలా దసరా వేడుకల్లో విధ్వంసానికి కుట్రపన్నిన ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశాడు. ఇతడు 2005లో టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి, పేలుడు కేసులో నిందితుడు. దసరా వేడుకల్లో నరమేధం సృష్టించేలా, హ్యాండ్ గ్రెనేడ్లతో విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తొయిబా ఉగ్రవాదులైన అబ్దుల్ జావెద్, అహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్ కుట్రపన్ని.. సీసీఎస్ సిట్ (స్పెషల్ ఆపరేషన్ టీమ్)కు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారనే అంశంపై సిట్ దర్యాప్తు చేపట్టింది. పట్టుబడిన ఈ ముగ్గురు ఉగ్రవాదులకు.. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్ ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
కుట్రలు, ఆర్థిక సహాయంలో కీలకం..
ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన ఖలీమ్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2005లో బేగంపేటలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంపై బంగ్లాదేశ్కు చెందిన మానవబాంబు (డాలీ) దాడిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో డాలీని హైదరాబాద్కు తీసుకొచ్చింది ఖలీమేనని పోలీసులు నిర్ధారించారు. అతడికి మూసారాంబాగ్లోని ఒక ఇంట్లో నుంచి పేలుడు పదార్థమైన అమోనియం నైట్రేట్ను అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. మూసారాంబాగ్కు చెందిన షాహెద్ బిలాల్ ఈ కేసులో కీలక సూత్రధారి. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్కు పారిపోయి.. పలు విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత పాకిస్తాన్లోనే ఎన్కౌంటర్ అయ్యాడు.
ఈ కేసులో అతడి సోదరుడైన అబ్దుల్ జావెద్ను, ఖలీమ్ను అప్పట్లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు 2017లో వీగిపోయింది. దీంతో ఆ కేసులో అరెస్టయిన నిందితులంతా జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఉన్నప్పుడే జావెద్ ఇలాంటి కుట్రలకు ప్లాన్చేసి, బయటకు వచ్చిన తర్వాత తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న వారితో ఒక గ్రూప్ను తయారు చేశాడు. ఇందులో ఖలీమ్ కూడా కీలక పాత్ర పోషించాడు. కాగా, ఘోరీ దసరా వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నాడు. ఇందుకు రెండుసార్లు ఖలీమ్ ద్వారా రూ.10 లక్షలు అబ్దుల్ జావెద్ ముఠాకు అందజేశారు. పోలీసుల విచారణలో ఖలీమ్కు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. గురువారం అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.