సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఎ.రషీద్ కథనం ప్రకారం… పాతబస్తీ ఫలక్నుమాకు చెందిన సయ్యద్ మోయిజ్ పాషా వృత్తిరీత్యా ట్రావెలింగ్ ఏజెంట్. స్థానికంగా తనకు నమ్మకస్తులైన వారిని ఎంచుకొని, టూరిస్టు వీసా పై దుబాయ్కు పంపిస్తుంటాడు. గత నెలలో వట్టేపల్లికి చెందిన సమీర్ఖాన్ను దుబాయ్ పంపించాడు. అక్కడ 700 గ్రాముల బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసిన సమీర్ఖాన్ గత నెల 28న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పిన అతడు బంగారు బిస్కెట్లను పాషాకు అందజేశాడు. స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని మసూద్ జ్యువెలరీ షాపు యజమాని మహ్మద్ హర్షద్(41)కు పాషా విక్రయిస్తుండగా రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు, కస్టమ్స్ అధికారులతో కలిసి పట్టుకున్నారు. పాషా, సమీర్ఖాన్, జ్యువెలరీ షాపు యజమాని మహ్మద్ అర్షద్లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.40లక్షల విలువైన 700 గ్రాముల బంగారు బిస్కెట్లు, 13పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ పి.నారాయణ పర్యవేక్షణలో రాజేంద్రనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రెడ్డి, ఎస్ఐ కె.రవి, హెడ్ కానిస్టేబుల్ సిరాజుద్దీన్లతో కలిసి కేసును ఛేదించారు.