సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉన్నత చదువులు చదివినా ఇంట్లో దంపతులు చిన్న చిన్న వివాదాలను పెద్దవి చేస్తూ విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని గమనించక పట్టుదలకు పోయి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా కేంద్రం కొత్త జీవితాన్నిస్తోంది. ఆపద వచ్చిందని అక్కడకు పోతే మేమున్నామంటూ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలో నేర్పుతున్నారు. కౌన్సెలింగ్ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ గతాన్ని మరిపించి.. భవిష్యత్తుపై ఆశలు పెంచుతూ కాపురాలను తీర్చి దిద్దుతూ శభాష్ అనిపించుకుంటున్నారు.
మాధురి హైదరాబాద్లో పుట్టి పెరిగి, పీహెచ్డీ వరకు చదివింది. నల్గొండ జిల్లాకు చెందిన వివేక్ అనే వ్యాపారితో 12 ఏండ్ల క్రితం పెండ్లి అయింది.(పేర్లు మార్చాం). వారికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లు ప్రేమ, ఆప్యాయతల మధ్య కాపురం సాగింది. భర్త వ్యాపారి కావడంతో వ్యాపారంలో ఎక్కువ సమయం కేటాయించడం, భార్య, పిల్లల గూర్చి పట్టించుకోకపోవడంతో పాటు సూటిపోటి మాటలతో భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఓపిక పడుతూ వచ్చిన ఆమె కొన్నాళ్లు తనలో తానే కుమిలిపోయింది. వేధింపులతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. తానే పిల్లలను పోషించుకుంటానని, భర్తతో దూరం ఉంటానని చెప్పింది. పెద్దలు నచ్చజెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం, ఇక తనకు ఎవరూ లేరనే మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఆమె కుమిలిపోయింది. ఇంతలో ఒకసారి భరోసాకు వెళ్లి రావాలని తెలిసిన వారు చెప్పడం, ఆమె మనస్సు కూడా చివరి ప్రయత్నం చేద్దామని చెప్పడంతో భరోసా కేంద్రానికి వచ్చింది.
కాగ్నెటీవ్ బిహేవియర్ థెరపీ..
భరోసాకు వచ్చిన ఆమె తన బాధను చెప్పుకుంది. దీంతో భార్యాభర్తలిద్దరిని భరోసా కేంద్రానికి కౌన్సెలింగ్కు పిలిపించారు. భర్త ఒత్తిడి.. భార్య బాధ వీటన్నింటికి కారణాలు, వాటి పరిష్కారానికి మార్గాలు వివరించారు. సీబీటీ కాగ్నెటీవ్ బిహేవియర్ థెరపీ, కపుల్ థెరపీ ద్వారా ఐదు నుంచి ఆరు విడుతలుగా భార్యాభర్తల మానసిక పరిస్థితులకు అనుగుణంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎవరి పొరపాట్లు వాళ్లు అర్థం చేసుకున్నారు. విడిపోవడం వల్ల పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భార్య ఆలోచించింది. భర్త కూడా అదే విధంగా ఆలోచించి కుటుంబం బాగున్నప్పుడే నేను బాగుంటాననే సత్యాన్ని తెలుసుకొని కలిసిమెలిసి జీవిస్తున్నారు. భరోసా ప్రతినిధులు ఇచ్చిన కౌన్సెలింగ్తో ఆ కుటుంబం నేడు ఆనందంగా ఉంది.
వచ్చిన వారికి భరోసా…
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నేతృత్వంలో కొనసాగుతున్న భరోసా కేంద్రానికి వివిధ సమస్యలపై ప్రతి రోజు పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. ఇందులో ప్రధానంగా భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలతో వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఇలా వచ్చిన వారందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్యలు పరిష్కరించి గాడిన పెడుతున్నారు.
ఒకే ప్రాంగణంలో..
షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ కేంద్రాలకు వచ్చే వారి సమస్యలు దాదాపు దగ్గరగా ఉంటాయి. ఇతరుల నుంచి వేధింపులు ఎదుర్కొనే వారు షీ టీమ్స్కు రావడం, వాటి ద్వారా కుటుంబ సమస్యలుంటే పరిష్కారానికి భరోసాను సందర్శించడం చేస్తుంటారు. ఈ రెండింటికి ఇన్చార్జి ఒకే అధికారి ఉండటం, కౌన్సెలర్లతో పాటు పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
సమస్యతో వస్తారు.. సంతోషంగా వెళ్తారు
భరోసా కేంద్రానికి కుటుంబ పరమైన సమస్యలతో వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. చాలామంది భార్యాభర్తలు గొడవలు పడుతూ నలుగుతుంటారు, మరికొందరు తట్టుకోలేక విడాకుల వరకు వెళ్తుంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, దంపతుల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ, ప్రేమ, ఆప్యాయతలు పంచుకోవాలి. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమైంది. పరిష్కరించుకోలేని కుటుంబ సభ్యులుంటే మీ కోసం భరోసా కేంద్రం, షీ టీమ్స్ ఉన్నాయనే విషయాన్ని మరిచిపోవద్దు. మీ కోసం మేమున్నాం.
– శిరీషా రాఘవేంద్ర , అదనపు డీసీపీ, షీ టీమ్ ఇన్చార్జి,భరోసా