జీడిమెట్ల, ఆగస్టు 11 : ఇద్దరిని హత్యచేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. జీడిమెట్ల ఠాణాలో బాలానగర్ ఏసీపీ గంగారాం , జీడిమెట్ల సీఐ ఎం.పవన్ గురువారం రాంరెడ్డినగర్లో జరిగిన హత్య కేసులో నిందితుడి వివరాలను వెల్లడించారు. జార్ఖండ్కు చెందిన బీరేంద్ర కుమార్ సింగ్ (37) జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ ఇంజినీరింగ్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గతనెల 26న బీరేంద్ర కుమార్ సింగ్ వద్దకు ఉపాధి కోసం 9 మందితో పాటు అతడి బంధువైన భునేశ్వర్ కూడా వచ్చాడు. అదే రోజు రాంరెడ్డినగర్లో ఉన్న రూంలో మద్యం సేవించారు. 9 మందిలో నలుగురు సదరు ఇంజినీరింగ్ కంపెనీలో పనిచేసేందుకు ఎంపికయ్యారు. భునేశ్వర్ ఎంపిక కాలేదు. దీంతో భునేశ్వర్.. నేను ఇక్కడ ఉండను.. జార్ఖండ్కు వెళ్లిపోతాను.. అని బీరేంద్రకుమార్ సింగ్తో చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. భునేశ్వర్ కోపంతో వీరేంద్రకుమార్ సింగ్ తలపై కర్రతో దాడి చేశాడు.
అక్కడే ఉన్న ఇబాదత్ అన్సారీ (22) అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై కూడా కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో బీరేంద్రకుమార్, ఇబాదత్ అన్సారీ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరిని చంపిన తనను బంధువులు బతకనివ్వరని భావించిన భునేశ్వర్.. భయంతో గదిలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను లీక్ చేసి నిప్పు అంటించుకొని తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ధైర్యం చాలకపోవడంతో విరమించుకొని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు జార్ఖండ్లో తలదాచుకున్న అతడిని గుర్తించి అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు హరీశ్, గౌతం, మన్మథరావు, సతీశ్ కుమార్రెడ్డి, ఆంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.