సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్..శుక్రవారం కాసేపు మెట్రో రైలులో ప్రయాణించి సందడి చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. అనంతరం రాయదుర్గం నుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు. తన 20 నిమిషాల ప్రయాణంలో వివిధ వర్గాల ప్రయాణికులతో ముచ్చటించారు. అభివృద్ధి గురించి చర్చించారు. ఒక సాధారణ ప్రయాణికుడిగా మంత్రి కేటీఆర్ కనిపించడంతో ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితో పాటు, ఎంబీబీఎస్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్తో మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్తో సెల్ఫీ దిగి మురిసిపోయారు. జర్మనీతో సమానంగా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నదంటూ.. ఆ ప్రయాణికుడు కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థినులు నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్టు కేటీఆర్కు వివరించారు. ఈ సందర్భంగా ‘గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చింద’ని మంత్రి కేటీఆర్ వారిని అడిగారు.
స్నేహితుల ద్వారా తెలుసుకుని శిక్షణ పూర్తి చేశామని బదులివ్వగా, వారికి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరితో పాటు పలువురు మహిళలు, వృద్ధులతో కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేరళకు చెందిన ఓ టూరిస్ట్ నగరంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ చాలా గొప్పగా ఉందని కితాబిచ్చారు. నూతనంగా నిర్మించిన అనేక కట్టడాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు గొప్పగా ఉన్నాయని అన్నారు. ‘తెలంగాణకు కిటెక్స్ పరిశ్రమ వచ్చినప్పుడు మా రాష్ట్రంలో మీ గురించి చర్చ జరిగింద’ని చెప్పారు. మీలాంటి నాయకుడు మాకుంటే బాగుండని అనుకున్నామని తెలిపారు. నవంబర్ 30న ఎన్నికల్లో కచ్చితంగా అందరూ ఓటేయ్యాలని మంత్రి కేటీఆర్ ప్రయాణికులకు సూచించారు.