మేడ్చల్, డిసెంబర్ 12 : ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలను వెల్లడించారు. మేడ్చల్ పరిధిలో ఇటీవల నూతన్కల్లోని ఎల్లమ్మ ఆలయం, ఎల్లంపేటలోని శివాలయం, వినాయక్నగర్లోని పోచమ్మ ఆలయం, అక్బర్జాపేటలోని హనుమాన్ ఆలయం, ఘనపూర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ఇంద్రానగర్లోని నల్లపోచమ్మ ఆలయంలో దొంగతనాలు జరిగాయి. ఆలయాల్లో జరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, నిఘా పెట్టారు. ఒక ఆలయంలో లభించిన సీసీ ఫుటేజీ ఆధారంగా తూప్రాన్ మండలం కుచారం గ్రామ పరిధిలోని ముప్పిరెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు, కాళ్లకల్కు చెందిన దూదేకుల అబ్బాస్ ఈ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరిద్దరు కలిసి భద్రతలేని ఆలయాలను ఎంచుకొని దొంగతనాలు చేస్తున్నారు. చోరీ సొత్తును ఇద్దరు సమానంగా పంచుకుంటారు. ఏసీపీ రామలింగరాజు పర్యవేక్షణలో సీఐ రాజశేఖర్ రెడ్డి, డీఐ కృష్ణ ప్రసాద్, ఎస్సై నర్సింహ, పోలీసులు సిబ్బంది సహాయంతో ఆంజనేయులు, అబ్బాస్ను పట్టుకున్నారు. వారి నుంచి బజాజ్ పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..
ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని, నిత్యం పరిశీలించాలని ఏసీపీ రామలింగరాజు సూచించారు. దొంగతనం జరుగకుండా, జరిగినా వెంటనే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.