బన్సీలాల్పేట్, డిసెంబర్ 12 : గాంధీ దవాఖానకు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. నిత్యం వందలాది మంది వచ్చే గాంధీకి భద్రత పెంచాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం టెండర్ గడువు దాటిన సంస్థకు కాకుండా గత ఐదు నెలల కిందట జీడీఎక్స్ ఫెసిలిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే సంస్థకు నిర్వహణ, సెక్యూరిటీ బాధ్యతలను అప్పగించింది. అంతకు ముందు కేవలం 86 మంది సెక్యూరిటీ ఉండగా.. ప్రస్తుతం 170 మందికి, పారిశుధ్యం నిర్వహణకు గతంలో 170 మంది ఉండగా, ప్రస్తుతం 280 మందికి పెంచింది. దాంతో పారిశుధ్యంతోపాటు భద్రత కట్టుదిట్టంగా అమలవుతున్నది. వార్డుల్లో సైతం నిఘా పెంచి, సెల్ఫోన్లను అపహరిస్తున్న పలువురు దొంగలను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.
మరిచిపోయిన వస్తువులు అందజేత..
సోమవారం తన స్కూటర్కు తాళాలు మరిచిపోయిన మహిళా డాక్టర్కు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఆమెకు అందజేశారని జీడీఎక్స్ సంస్థ మేనేజర్ రవికుమార్, చీఫ్ సెక్యూరిటీ అధికారి శివాజీ, శానిటరీ సూపర్వైజర్ బాబూరావు తెలిపారు. అలాగే ఇటీవల తన విలువైన ల్యాప్టాప్ పోగొట్టుకొన్న మరో వైద్యుడికి దానిని సురక్షితంగా అందజేశామన్నారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో 200కు పైగా సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో అన్ని మార్గాలు, వార్డులు, అత్యవసర విభాగాలు నిఘాలో ఉన్నాయని వారు చెప్పారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, బందోబస్తు పటిష్టంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సెల్లార్, వార్డుల్లో, డైట్ క్యాంటీన్లో ప్రమాదకరంగా మారిన ఎలుకలను కూడా నియంత్రించామని చెప్పారు.
సెక్యూరిటీ చేపట్టిన తాజా చర్యలు