మియాపూర్ , డిసెంబర్ 12 : ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియపై అధికారులు మరింత దృష్టి సారించారు. గడువులోగా వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలన్న అధికారుల ఆదేశాల నేపథ్యంలో… చందానగర్ సర్కిల్ పరిధిలో కసరత్తు పెంచారు. రోజువారీ లక్ష్యాలను సిబ్బం ది వేగవంతం చేసేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ పెం చారు. కాగా చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 74 కోట్ల మేర ఆస్తిపన్ను వసూళ్లను అధికారులు చేపట్టారు. ఈ నెలకు గాను రూ. 11 కోట్ల మేర లక్ష్యాన్ని నిర్ధారించుకోగా.. ఇప్పటికే రూ. 4 కోట్లకు పైగా వసూలు చేశారు. గత నెల ఈ ప్రక్రియ కొంత మందగించిన నేపథ్యంలో ఈ నెలలో దూకుడు పెంచాలని సిబ్బందిని ఆదేశించారు . జోనల్ కమిషనర్ సైతం నిత్యం సర్కిళ్ల వారీగా ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షిస్తున్న తరుణంలో .. అధికారులు మరింత వేగవంతం చేస్తున్నారు. అయితే గతేడాది ఈ మాసానికల్లా రూ. 73 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు కాగా.. ఈ ఏడాది రూ. 74 కోట్లు వసూలయ్యాయి. గతేడాది కంటే అదనంగా రూ. కోటితో సర్కిల్ ముందున్నది. మార్చి కల్లా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఇప్పటికే సర్కిల్ ఉప కమిషనర్ సుధాంశ్ ఏఎంసీలు సుధీర్ చంద్ర, వాహెద్లను ఆదేశించారు.
రూ. 100 కోట్ల వసూలే లక్ష్యం..
చందానగర్ సర్కిల్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం ఉన్నది. ఇప్పటికే రూ.74 కోట్లు వసూలు కాగా.. మరో రూ. 26 కోట్ల లక్ష్యాన్ని మరో మూడు నెలల్లో చేరుకోవాల్సి ఉన్నది. సర్కిల్ పరిధిలో చందానగర్, మియాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్ వార్డులున్నాయి. గృహ, వాణిజ్య విభాగానికి చెంది 93 వేల వరకు అసెస్మెంటులున్నాయి. నాలుగు వార్డులలో కలిపి మొత్తం 10 డాకెట్ల పరిధిలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మాదాపూర్ వార్డులో భారీ ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు, షాపిం గ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, మాల్స్ సహా ఇతర సంస్థలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ వార్డు నుంచే అత్యథికంగా సర్కిల్కు ఆస్తిపన్నులు పెద్ద మొత్తంలో వసూలవుతున్నాయి. దీంతో మిగిలిన వార్డులతో పాటు మాదాపూర్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి విభాగం నుంచి పన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.