కొండాపూర్, డిసెంబర్ 12 : గచ్చిబౌలి – మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం ఆయన కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటుందన్నారు. గచ్చిబౌలి – మియాపూర్ మార్గంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. 3 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్లో 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్పాస్ను నిర్మించడం జరిగిందన్నారు. ఐటీ హబ్కు కేరాఫ్గా నిలుస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్లు, అండర్పాస్లను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో వేల కోట్లాది రూపాయాలతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. అతి త్వరలోనే గచ్చిబౌలి – మియాపూర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.
మంజీర పైపులైన్ పనుల పరిశీలన..
చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీలో పగిలిన మంజీర పైపులైన్ పునరుద్ధరణ పనులను సోమవారం ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ స్థానిక కార్పరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ఆకస్మాత్తుగా పైపులైన్ పగిలిపోయిందన్న సమాచారం తెలుసుకుని వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పైపులైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆకస్మాత్తుగా పైపులైన్ పగిలిపోవడంతో పరిసర అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో విద్యుత్, జలమండలి, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సెల్లార్లలో చేరిన నీటిని మోటార్ల సహాయంతో తొలగిస్తున్నామని, అక్కడే నివా సం ఉండే వాచ్మెన్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు తెలిపారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నా రు. మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ట్రాన్మిషన్ జీఎం మాణిక్యం, డీజీఎం మహ్మద్ అజారుద్దీన్, మేనేజర్ అన్వర్, జీహెచ్ఎంసీ ఏఈ సంతోష్రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.