HMDA | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ‘తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి’అన్నట్లు వ్యవహరిస్తోంది హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల విషయంలో చేతులెత్తేస్తోంది. భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులివ్వడమే కాదు… వాటిని సక్రమంగా హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారో.. లేదో పర్యవేక్షిస్తూ అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన పూర్తి బాధ్యత హెచ్ఎండీఏపైనే ఉన్నది.
అయినా, ఈ విషయంలో అధికారులు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న లోకల్ బాడీస్ (స్థానిక సంస్థలు)కు పూర్తి స్థాయిలో డెలిగేషన్ పవర్స్ ఇచ్చేశామంటూ పాలసీ విధానాలను చెబుతున్నారే తప్ప, అక్రమాల జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలే కాదు.. లేఅవుట్లు సైతం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాలనీలో చేపడుతున్న జీ ప్లస్ 5 అపార్టుమెంట్ నిర్మాణానికి హెచ్ఎండీఏ పరిధిలోని శంకర్పల్లి జోన్ ప్లానింగ్ విభాగం అధికారులు అనుమతులిచ్చారు. దీనిపై స్థానికులు హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడం లేదని, సెట్ బ్యాక్స్ సరిగా లేకుండా నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అడ్డుకోవాల్సిన హెచ్ఎండీఏ అధికారులు.. కేవలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు లేఖ రాసి చేతులు దులుపుకొన్నారు. ఈ లేఖపైనా స్థానిక సంస్థ అధికారులు సైతం చర్యలు తీసుకోలేదు. హెచ్ఎండీఏ అనుమతిచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా చుట్టూ డీవియేషన్స్తో చేపట్టిన నిర్మాణాన్ని మాత్రం ఇప్పటికీ అడ్డుకోలేదు. దీనిపై కాలనీ వాసులు హెచ్ఎండీఏ కార్యాలయం, స్థానిక సంస్థ బీజేఎంసీ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే అనుమతుల ప్రకారం భవనాల నిర్మాణాలు జరగడం లేదని ఫిర్యాదు చేస్తే మాత్రం హెచ్ఎండీఏ చట్టం-2008 సెక్షన్ 23(2) ప్రకారం డెలిగేషన్ పవర్స్ను స్థానిక సంస్థలకు ఇచ్చామని, దానికి సంబంధించిన నంబరు (లెటర్ నంబరు 803/పాలసీ/పీఎల్జీ/హెచ్ఎండీఏ/2020 (19-03-2020)న జారీ చేసిన లేఖను ఫిర్యాదు దారులకు చూపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంపై సమాచార హక్కు చట్ట ప్రకారం హెచ్ఎండీఏను వివరణ కోరినా అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారే తప్ప, అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల విషయంలో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హెచ్ఎండీఏ పరిధిలోని బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 8 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 12 విల్లాలను పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కట్టారని, వాటిని కూల్చివేయాలంటూ.. కొందరు హెచ్ఎండీఏకు ఫిర్యాదు చేశారు. దానికి హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీకి ఆదేశాలిచ్చారు. దీనికి గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేయడానికి పోలీస్ బలగాలు కావాలని హెచ్ఎండీఏకు, జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఇలా అక్రమ నిర్మాణాలను అడ్డుకునే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.