కనిష్టం 5.. గరిష్టం 15
తక్కువ చార్జీలు.. సురక్షిత ప్రయాణం
నగర ప్రయాణికులకు అందుబాటులో ఎంఎంటీఎస్
ప్రస్తుతం అందుబాటులో 86 లోకల్ రైలు సర్వీసులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులకు సంబంధించి ఆయన గురువారం ప్రత్యేక సమాచారం విడుదల చేశారు. ఉద్యోగాల వల్ల ప్రతి రోజూ ప్రయాణం చేసే వారికి, దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఉపయోగపడే విధంగా జంట నగరాలలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) ఎంతో సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉంటుందన్నారు.
కరోనా తర్వాత ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను ప్రస్తుతం 86 సర్వీసులను నడుపుతున్నట్లు జీఎం తెలిపారు. ప్రధానంగా నగరంలోని దక్షిణాన, తూర్పు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతంతో అనుసంధానిస్తూ ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్- హైదరాబాద్-లింగంపల్లి-తెల్లాపూర్-రామచంద్రాపురం ప్రాంతాల మీదుగా 29 రైల్వే స్టేషన్ల కలుపుతూ లోకల్ సర్వీసులను నడుపుతున్నామన్నారు.
అర్థరాత్రి 12.30 గంటల వరకు
నగర ప్రయాణికుల కోసం ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులు ప్రతి రోజు తెల్లవారు ఉదయం 4.30 గంటలకే ప్రారంభమవుతాయన్నారు. తిరిగి అర్థరాత్రి 0.30 గంటల వరకు నడుస్తాయన్నారు. ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసుల ప్రయాణం కోసం తక్కువ ఛార్జీలు ఉన్నట్లు తెలిపారు. అతి తక్కువగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.15 మాత్రమే టిక్కెట్ ఛార్జీ వసూలు చేస్తున్నామన్నారు.టిక్కెట్ ఇబ్బందులు లేకుండా అటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చనీ జీఎం పేర్కొన్నారు.