సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో రైలు ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ఇప్పుడు అదే పీపీపీ పీటముడిగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విధానాన్ని హాట్కేక్లా భావించిన ఎల్అండ్టీ సంస్థ ఇప్పుడు ఆ పదం అనగానే ఆందోళనకు గురవుతున్నది.ఈ నేపథ్యంలో గత ఒప్పందంలో భాగంగా పాతబస్తీ మెట్రో పనులను కూడా ఇదే విధానంలో చేపట్టాల్సి ఉండగా… ఎల్అండ్టీ సంస్థ మాత్రం ససేమిరా అంటున్నది. సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన ఎంజీబీఎస్-ఫలక్నుమా అలైన్మెంట్ మెట్రో పనులకు సాధారణ విధానంలో టెండర్లు పిలిస్తే పనుల నిర్వహణకు ముందుకొస్తామేగానీ… పాత ఒప్పందంలోని పీపీపీ అంటే మాత్రం చేతులెత్తేయడం మినహా గత్యంతరంలేదని తేల్చి చెబుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో మూడు అలైన్మెంట్లలో సుమారు 72 కిలోమీటర్ల మేర రూపకల్పన చేశారు. ఇందులో జేబీఎస్-ఫలక్నుమా మార్గంలో ఎంజీబీఎస్ వరకు మాత్రమే పనులు పూర్తి చేశారు. దీంతో 5.5 కిలోమీటర్ల ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం పెండింగ్లో ఉండి పోయింది. మిగిలిన రెండు మార్గాలతో పాటు మూడో మార్గంలో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో అందుబాటులోకి వచ్చి కొనసాగుతున్నది. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ సంస్థ 35 ఏండ్ల పాటు నిర్వహణను కూడా చేపట్టాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు పాతబస్తీతో పాటు ఎయిర్పోర్టు మెట్రోతో 70 కిలోమీటర్ల మేర ఏడు మార్గాలకు ప్రతిపాదనలు తయారు చేశారు.
పాత ఒప్పందంలోని ఎంజీబీఎస్-ఫలక్నుమా 5.5 కిలోమీటర్ల మార్గాన్ని చేర్చారు. ఈ పనులకు కొన్నిరోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ అలైన్మెంట్ గత పీపీపీ ఒప్పందంలో ఉన్నందున పెరిగిన ధరల మేరకు అంచనాలు పెంచి ఎల్అండ్టీకే పనులు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఎల్అండ్టీ మాత్రం అందుకు ముందుకు రావడం లేదు. పీపీపీ విధానంలో ప్రయాణికుల టికెట్ల ద్వారా 40 శాతం, వ్యాపార ప్రకటనలపై మరో ఐదు శాతం ఆదాయం వస్తే మిగిలిన 55 శాతం రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వస్తుందని పొందుపరిచారు. కానీ ఎల్అండ్టీ సంస్థకు ప్రాజెక్టులోని రియల్ ఎస్టేట్ రంగం ఆశాజనకంగా లేదు. దీంతో పీపీపీ విధానానికి ఆ సంస్థ సుముఖంగా లేదు. సాంకేతికంగా తప్పించుకునేందుకు ప్రభుత్వపరంగానే ఆ మార్గం పనులు మొదలుకానందున తాము చేపట్టలేమని తేల్చి చెబుతున్నది.
ఎంజీబీఎస్-ఫలక్నుమా అలైన్మెంట్ పనులు మొదలు కావాలంటే తొలుత నిర్మాణ సంస్థ ఖరారు కావాలి. పాత ఒప్పందం ప్రకారం పీపీపీ విధానానికి ఎల్అండ్టీ సంస్థ అంగీకరించడం లేదు. దీంతో సంస్థను ఒప్పించి ఆ ఒప్పందం ప్రకారం ముందుకుపోవడమా? లేదా సాధారణ టెండర్ల ద్వారా ప్రాజెక్టు పనులకు టెండర్ పిలవడమా? అనేది తేలాల్సి ఉంది. పెరిగిన రేట్ల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచి పనులు అప్పగించేందుకు గతంలోని కేసీఆర్ ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా అంగీకరించే అవకాశమున్నది. కానీ పీపీపీ విధానమంటేనే ఎల్అండ్టీ ఒప్పుకునే పరిస్థితి లేదు.
ఈ క్రమంలో సాధారణ టెండర్లు పిలిచినా… ప్రాజెక్టు నిర్వహణ ఎలా? అనే మరో పీటముడి ఉంది. ఇందుకోసం హెచ్ఎంఆర్ఎల్ అధికారులు మళ్లీ కొత్త విధి విధానాలతో టెండరును రూపొందించాలి. ఈ గండం గట్టెక్కినా… ఇప్పటికే ఎల్అండ్టీ నిర్వహిస్తున్న అలైన్మెంట్కు ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గాన్ని అనుసంధానించాలి. ఇందుకు ఎల్అండ్టీ అంగీకరించాలంటే ఆ సంస్థ నుంచి ఎలాంటి షరతులు ఉంటాయోనన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇలా పాతబస్తీ మెట్రో పనుల ప్రారంభానికి పీపీపీ-టెండర్లు-నిర్వహణ విధి విధానాలు వంటి పలు సవాళ్లు పీటముడిగా మారాయి.