Hyd Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశలపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బందికి హైదరాబాద్లో మెట్రోరైలు ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెటో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపారని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని కలుపుతూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్ల తయారీ శరవేగంగా జరుగుతుందన్నారు. ఫేజ్-2 లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షణీయమవుతాయన్నారు. హెచ్ఎంఆర్ఎల్ ఇంజినీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఇటీవల ఫేజ్-2 రూట్మ్యాప్, 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా మెట్రో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసిన పంపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ మెట్రో కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు. ఫలక్నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు కొత్తగా మెట్రో లైన్కు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ మెట్రో కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 29 కిలోమీటర్లు విస్తరించాలని, నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ మీదుగా చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్పల్లి మెట్రో నుంచి ఎయిర్పోర్ట్ వరకు ప్రతిపాదించారు.
కారిడార్-4లో మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా హైకోర్టు వరకు నాలుగు కిలోమీటర్లు ప్రతిపాదనలు చేశారు. కారియర్-5లో రాయదుర్గం మెట్రో నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు, రాయదుర్గం నుంచి నానక్రామ్గూడ, విప్రో జంక్షన్ మీదుగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో కారిడార్-6లో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 14 కిలోమీటర్లు.. మియాపూర్, బీహెచ్ఈఎల్ నుంచి పటాన్చెరు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇక కారిడార్-7లో ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్నగర్ వరకు 8 కిలోమీటర్ల వరకు రెండో దశలో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది.