Hyderabad Metro | సిటీబ్యూరో, మే 2(నమస్తే తెలంగాణ) : అనతికాలంలోనే అనూహ్యమైన ఆదరణ పొందిన హైదరాబాద్ మెట్రో.. మరో మైలురాయిని చేరుకున్నది. ఏకంగా ఇప్పుటివరకు 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి..చరిత్రను లిఖించుకున్నది. దేశంలోనే మూడో అతి పొడవైన మెట్రో వ్యవస్థగా గుర్తింపు పొందిన హెచ్ఎంఆర్ఎల్.. నగరవాసుల మనస్సును చూరగొంటున్నది. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే మెట్రోకు అనూహ్యమైన స్పందన లభించింది.
మియాపూర్-అమీర్పేట మార్గంలో 11 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను 2017లో తీసుకురాగా, అప్పటి నుంచి దశల వారీగా సర్వీసులను పెంచుతున్నారు. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గ్ మార్గాల్లో దాదాపు 68 కిలోమీటర్ల పొడవైన లైన్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం నగరంలో నిత్యం 4-5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను పొందుతుండగా, 2017 నుంచి ఇప్పటివరకు (2024 మే 1 నాటికి) 50 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించడంతో హెచ్ఎంఆర్ఎల్ మరో మైలురాయిని అధిగమించినైట్లెంది. గతేడాది జూలైలో ఒక్క రోజులో 5.1 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చి..హైదరాబాద్ మెట్రో రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.