Rain Alert | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో నగరానికి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే ద్రోణి ప్రభావంతో ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయి, నగర వాతావరణం చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.6, కనిష్ఠం 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.