సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు గ్రేటర్ సమాయత్తం అవుతోంది. అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యం, ఉత్సవ సమితుల సమన్వయంతో కన్నుల పండువగా ఉత్సవాలు నిర్వహించేందుకు నగరం సన్నద్ధమవుతున్నది. పర్యావరణ హితమే లక్ష్యంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో 4.10లక్షల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. భక్తులకు సకల వసతులు కల్పిస్తూనే, అత్యవసర సేవల్లో భాగంగా వైద్య శిబిరాలు, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా చెరువులు, రహదారుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా పటిష్టమైన పోలీసు బందోబస్తునూ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 10,500 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టులలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఆయా శాఖల అధికారులతో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలో లక్ష , జీహెచ్ఎంసీలో 3 లక్షల మట్టి గణపతి ప్రతిమలను కార్పొరేటర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాట్లపై బుధవారం డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నగరంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సూచించిన అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ ద్వారా స్టాటిస్టిక్స్ మొబైల్ క్రేన్లు గత ఏడాది కంటే అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లపై బారికేడ్లు, శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్స్, మొబైల్ ట్రీ కటింగ్, ఆరోగ్య శిబిరాలు, బోట్లు, స్విమ్మర్లు, నిరంతర విద్యుత్తు సరఫరా, వీధి లైట్లు, పాట్హాల్స్, రోడ్డు మరమ్మతులు, అగ్నిమాపక యంత్రాలు, తాగునీటి సరఫరా, తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు మేయర్ తెలిపారు.
డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ వివిధ శాఖల సమన్వయంతో వ్యవహరించి, భక్తులకు పలు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఊరేగింపు సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వినాయక చవితిని నగరవాసులు ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులు, చర్యలపై సమగ్రంగా చర్చించి, పలు సూచనలు చేశారు.