దుండిగల్, ఫిబ్రవరి 14 : సైన్స్ను సమాజంలోకి తీసుకెళ్లడంలో ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) ప్రపంచం కంటే ఎంతో ముందున్నదని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రగతినగర్ సమీపంలోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్)లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీసెస్’ (సైనోప్స్) కేంద్రాన్ని మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో ఇన్కాయిస్ సేవలందించడం అభినందనీయమన్నారు.
ఇన్కాయిస్ మనదేశానికి గర్వకారణమన్న ఆయన హైదరాబాద్ నగరంలో ఇన్కాయిస్ అభివృద్ధికి సరైన ప్రాంతమన్నారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ ప్రతినిధులను ఆయన అభినందించారు. అంతకు ముందు ఇన్కాయిస్లోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించి వాటి ద్వారా అందే సేవలను తెలుసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్సైన్స్ సెక్రటరీ డా.ఎం.రవిచంద్రన్, ఇన్కాయిస్ డైరెక్టర్ డా.టి.శ్రీనివాసకుమార్లు మంత్రి కిరణ్ రిజిజుకు ఇన్కాయిస్ అందిస్తున్న సేవలతో పాటు సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీసెస్ పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ శాస్త్రవేత్తలు పట్టాభి రామారావు, అన్నపూర్ణయ్య, మురళీ, ఉదయ్, నాగరాజు, సుధీర్, జోసేఫ్, నాగేశ్వరరావు, సుబ్రమణ్యం, దేవేంద్రకుమార్, డి.ప్రసాద్, అనీష్, విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.