బాస్కెట్బాల్ పోటీల్లో రజత పతకం
జవహర్నగర్, ఏప్రిల్ 12: పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించి అరుంధతీనగర్ వచ్చిన మానసకు ఉపాధ్యాయ బృందం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆటల్లో చిన్నప్పటి నుంచే దిశానిర్దేశం చేసుకుని కఠోర శ్రమ చేస్తేనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని అన్నారు.
మానస చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని అనేక పతకాలను సాధించిందన్నారు. జాతీయ స్థాయి సీనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొని ద్వితీయస్థానం రజత పతకం రావడం పాఠశాలకు మరింత వన్నె తెచ్చిందని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ డి. అపర్ణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థి మానస జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని, మున్ముందు ఒలింపిక్స్లో మానసను చూడాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మానస తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆశాజీకుమార్, పంకజ్, సభేనా, చంద్రస్వామి, రామకృష్ణ, కాలనీవాసులు అబీద్, శ్రీను, ప్రభాకర్, దయాకర్, యాదగిరి, మనోజ్, దేవరాజ్, బాబురావు, భాస్కర్, ఏసురత్నం, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.