Hyderabad| ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత గచ్చిబౌలి జంక్షన్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఐటీ కారిడార్లో గచ్చిబౌలి అంటే ఆధునికతకు, ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎన్నో మౌలిక వసతులు కల్పించడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అనే మాటకు చోటే లేదు. బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ జంక్షన్లో వందల కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మిస్తుండడంతో వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది.’
ఒకప్పుడు సంపన్నుల నివాస ప్రాంతమంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పేర్లు మాత్ర మే వినపడేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గచ్చిబౌలి అత్యంత కీలకమైన ప్రాంతంగా ఎదిగింది. నగరం నలుమూలల ఉన్న ఐటీ ఉద్యోగులు రోజూ గచ్చిబౌలికి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతలా గచ్చిబౌలి అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో గణనీయమైన మార్పులు సంతరించుకున్నాయి. ఔటర్ రింగు రోడ్డు నుంచి హైదరాబాద్ మహానగరానికి ముఖద్వారంగా గచ్చిబౌలి నిలిచింది. నగరం నుంచి ఓఆర్ఆర్పైకి వెళ్లాలంటే ప్రధాన మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నది. అంతేకాదు… శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గంటకు 120 కి.మీ వేగంతో కేవలం 20 నిమిషాల్లో వెళ్లే మార్గం గచ్చిబౌలి జంక్షన్ నుంచే మొదలవుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై బీఆర్ఎస్ ప్రభుత్వం మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి ఔటర్ రింగు రోడ్డు మీది నుంచి నేరుగా మాదాపూర్, ఐకియా, మైండ్స్పేస్ జంక్షన్లకు వెళ్లేలా రూ. 270 కోట్లతో ఫ్లె ఓవర్ను నిర్మించింది. ప్రస్తుతం మరో ఫ్లై ఓవర్ను ఓఆర్ఆర్ మీదుగా కొండాపూర్ వైపు (పాత ముంబయి హైవే) నిర్మిస్తున్నది. ఇందుకోసం రూ.180 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇలా ఒకే జంక్షన్లో రూ.450 కోట్లతో అత్యాధునిక నిర్మాణ శైలిలో ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నది. ఇక్కడ చేపట్టిన మూడో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే ఒక జంక్షన్లో మూడు ఫ్లై ఓవర్లు ఒకదానిపై మరొకటి ఉండడం, అవి కూడా అత్యంత ఆధునికంగా.. ఇంజినీరింగ్ నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
… బరిగెల శేఖర్