శేరిలింగంపల్లి, జూన్ 23: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన కుమార్తెకు ఉరివేసి.. తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మణికొండ ఆంధ్రాబ్యాంక్ సమీపంలో నివసించే అలివేలు, సదానందం దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె లాస్య(14), కుమారుడు మణికంఠ(11). సదానందం ఇంటివద్దనే ఖాళీగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. కుటుంబం, బంధువులతో తలెత్తిన కలహాలతో ఇంటి అద్దెలు కూడా రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో 9వ తరగతి చదువుతున్న లాస్య, 7వ తరగతి చదువుతున్న మణికంఠ చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన అలివేలు గురువారం సాయంత్రం భర్త సదానందంకు రూ. 5వేలు ఇచ్చి యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లి రావాలని చెప్పి పంపించింది.
ఇంట్లో ఓ బెడ్రూంలో కుమారుడు మణికంఠ నిద్రపోగా.. మరో బెడ్రూంలో కూతురు లాస్య, తల్లి అలివేలు పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో కూతురు లాస్య(14)కు సీలింగ్ ఫ్యాన్కు ఉరివేయగా చనిపోయింది. ఆ తర్వాత ఆమె కూడా కిచెన్లో సీలింగ్ రాడ్కు ఉరివేసుకొని తనువు చాలించింది. మధ్యరాత్రి కుమారుడు మణికంఠ మెలుకువ వచ్చి చూడగా తల్లి అలివేలు, సోదరి లాస్య విగతజీవులుగా కనిపించారు. స్థానికులు సహాయంతో రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా.. అలివేలు తన పాత దుస్తులు, ఫోన్ను కాల్చివేసినట్లు, ఇంట్లో తల్లి అలివేలు, కూతురు లాస్యకు ఉపయోగించిన తాడుతోపాటు మరో ఉరితాడు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కుమారుడు మణికంఠకు కూడా ఉరివేయాలని భావించి.. అతడు నిద్రలో ఉండటంతో విరమించుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కూతురు లాస్య చేతులపై.. ది గేమ్ స్టార్టెడ్, డు సమ్థింగ్.. మేక్ యు హ్యపీ అంటూ… గోరింటాకు పెట్టుకొని ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేశ్ తెలిపారు.