మారేడ్పల్లి, డిసెంబర్ 16: రైళ్లలో మహిళాప్రయాణికుల మెడలోంచి బంగారు గొలుసులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్లు యు.నరసింహులు, ఎం.శ్రీనుతో కలిసి రైల్వే డీఎప్పీ ఎ.నర్సయ్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన అజిజుల్ సెక్ (30), సఫియార్ సర్దార్ (36), రాజషేక్ (25), సహజద షేక్ (34), అన్రూల్ లస్కర్ (32) , సఫియుల్హక్ మండల్ (44), ముజిబార్ మోల్ల (52), హైదర్ (35), హైదర్ (35), ఫిరోజ్ (24)లు టైలర్, లేబర్, డ్రైవింగ్ వృత్తుల్లో పని చేస్తున్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రైళ్లలో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసుకొని చైన్స్నాచింగ్లకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారు. ఇందులో భాగంగా తుంగభద్ర, గోదావరి, ఫలక్నామ ఎక్స్ప్రెస్ రైళ్లలో రద్దీ సమయంలో ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులకు ఐదు మంది బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పట్టించిన సీసీ కెమెరాలు…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ముఠా సభ్యులు రెండు చైన్స్నాచింగ్లకు పాల్పడినట్లు సీసీ ఫుటేజ్లలో రికార్డు కావడంతో నిందితుల్లో కొంత మందిని పోలీసులు గుర్తించారు. దీంతో రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా నిందితులందరూ ఈ నెల 15న (గురువారం) ఔరా ఎక్స్ప్రెస్ రైల్లో వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. 7 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరు నిందితులు హైదర్, ఫిరోజ్లు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన రైల్వే పోలీసు సిబ్బందిని రైల్వే ఎస్పీ, డీఎస్పీ ఎ.నర్సయ్య అభినందించారు.
చోరీ చేసిన ఆభరణాలు టూత్పేస్టులో…
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు దొంగిలించిన ఆభరణాలను టూత్పేస్టులో దాచి పెట్టి బ్యాగ్లో వేసుకుంటారు. టూత్పేస్టును తీసేసి అందులో ఆభరణాలను దాచిపెట్టి పెవికిక్తో సీజ్ చేస్తారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పట్టుబడినప్పుడు బ్యాగ్లో ఉన్న టూత్పేస్టు ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో బంగారు ఆభరణాలు దొరికాయి.