సికింద్రాబాద్, డిసెంబర్ 9;కొవిడ్ అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరి కంటి చూపు మందగించింది. ఈ నేపథ్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
వచ్చే ఏడాది జనవరి 18 నుంచి…
సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారిగా జనాభాలో ఎవరెవరికి పరీక్షలు చేయాలి తదితర వివరాలు సేకరిస్తున్నారు. కంటి సమస్యలతో బాధపడేవారికి పరీక్షలన్నీ చేయడానికి 100 రోజులు పట్టనుందని అంచనా వేస్తున్నారు.వారానికి 5 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి కావాల్సిన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కార్యక్రమం చేపట్టనున్నారు.
మెరుగైన వైద్యం అందేలా..
సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా వేలాది మంది కంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరందరికి మరోసారి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయనున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్స నిమిత్తం సిఫారసు చేస్తాం. వచ్చే ఏడాది జనవరిలో కార్యక్రమం ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
– రాజకుమారి,డిప్యూటీ డీఎంహెచ్వో, హైదరాబాద్