సిటీబ్యూరో, డిసెంబర్ 9, నమస్తే తెలంగాణ; భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా గ్రేటర్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొన్నది. తెలంగాణ భవన్లో శుక్రవారం భారత రాష్ట్ర సమితి జెండాను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించిన సమయంలో తెలంగాణ భవన్తో పాటు గ్రేటర్లో పలు చోట్ల జై కేసీఆర్, జై భారత్ నినాదాలు మార్మోగాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పలు ప్రాంతాల్లో సంబురాలు జరుపుకొన్నారు. జై భారత్, జై బీఆర్ఎస్..జై కేసీఆర్..అనే నినాదాలు హోరెత్తాయి. తెలంగాణ ఫలాలు దేశవ్యాప్తం కావాలంటే తెలంగాణ మోడల్ దేశానికి అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీలో
టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంతో ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ హాజరై మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీ అనేది కేంద్రప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ ప్రకటన తెచ్చుకున్న రోజని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామియాదవ్, రఘురాం, కార్యదర్శులు చందు, చటారి దశరథ్, మేకల రవి, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజుయాదవ్, కాటం శివ, రమేశ్గౌడ్, నాగేందర్రావు, అవినాశ్, రాజు, నరేశ్, మధు, వంశీ, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ కళాశాల ఆవరణలో…
బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మిఠాయిలు పంచుకొని గులాబీలతో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ని స్వాగతించారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ… నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి, యువత ఏ విధంగా కదిలారో భవిష్యత్ భారత నిర్మాణం కోసం కేసీఆర్కు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ బోయిళ్ల విద్యాసాగర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేశ్, శిగ వెంకట్, శశిపాల్, కృష్ణ, రాజేశ్నాయక్, కొంపల్లి నరేశ్, రాజు, మధు, నరేశ్ పాల్గొన్నారు.
దేశంలో మార్పుకోసం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
గోల్నాక, డిసెంబర్ 9 : పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లుగానే దేశంలో మార్పు తేవాలని సీఎం కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా అవతరించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరిందన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కేసీఆర్ తెలంగాణ ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో విప్లవాత్మక మార్పు రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ప్రధాని అయ్యే అర్హత కేసీఆర్కే ఉంది
బీజేపీ వ్యతిరేక పాలనను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రధాని అయ్యే శక్తి సీఎం కేసీఆర్కే ఉంది. అలాంటి మహానేత భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన సందర్భంగా దేశవ్యాప్తంగా గులాబీ జెండాను రెపరెపలాడించేలా ముందుకు సాగుతాం. దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన, అక్రమాలను అంతం చేయడం, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవడం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. అలాగే వేలాది మంది కార్మికులు రోడ్డుపాలవుతున్నారు. వారికి అండగా ఉంటాం.
–ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
రాజకీయాల్లో గుణాత్మక మార్పు..
కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 9 : భారతావని సమగ్ర సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి పార్టీ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురానుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీ దేశ రాజకీయాలను శాసించడం ఖాయం. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో…దేశ ప్రజల తలరాతను మార్చేందుకు నడుం బిగించిన అధినేత కేసీఆర్ వెంట నడిచేందుకు యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. దేశ రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి ఆయనకు ఉంది. భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యున్నతిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
ప్రభంజనం సృష్టిస్తాం
మియాపూర్ , డిసెంబర్ 9 : భారత రాష్ట్ర సమితి పార్టీగా ఆవిర్భవించడం శుభ పరిణామం.రాష్ర్టాన్ని యావత్ దేశం ఆదర్శంగా తీసుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో తీర్చిదిద్దారు. ఇదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సమీప రాష్ర్టాల్లో అమలు చేసేందుకు అక్కడి పాలకులు సిద్ధమయ్యారు. ఇది సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనం. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగెత్తిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి పార్టీతోనే సాధ్యం. బీఆర్ఎస్తో దేశ పాలనకు కొత్త దివ్వెలా పరిణమించడం తథ్యం.
–అరెకపూడి గాంధీ, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
బీఆర్ఎస్తో నూతన అధ్యాయం మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు
నేరేడ్మెట్, డిసెంబర్ 9 : దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్తోనే నూతన అధ్యాయం రాబోతున్నది. దేశంలో పేదరికం ఉండకూడదన్నదే నూతనంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆకాంక్ష. దేశంలోని యువతరం బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నరు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పని చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసి చూపించారు. అభివృద్ధి , సంక్షేమానికి రాష్ట్రంలో పెద్దపీట వేశారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ద్వారా ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తారు. దేశ సంపద సామాన్యులకు చేరేలా కృషి చేయనున్నారు. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం. దేశ ప్రజానీకం భారత రాష్ట్ర సమితి పార్టీకి జేజేలు పలుకుతున్నారు.
కార్వాన్ నియోజకవర్గంలో…
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా శుక్రవారం లంగర్హౌస్ లక్ష్మీనగర్ రింగ్రోడ్ చౌరస్తాలో కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్సింగ్ నేతృత్వంలో సంబురాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, భాస్కర్రెడ్డి, సత్యనారాయణ, కోడూరి శ్రీధర్ సాగర్, పట్లూరి రఘు, సురేందర్రెడ్డి , ఆదిత్య యాదవ్ పాల్గొన్నారు.