కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 9 : మంత్రి కేటీఆర్ మరోసారి గొప్ప మానవత్వాన్ని చాటారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. రెండు చేతులు కోల్పోయి.. కుటుంబపోషణ కష్టమై.. దీనస్థితిలో ఉన్న ఓ యువకుడికి అండగా నిలిచి..డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి.. భరోసా కల్పించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పాపామ్మపేట గ్రామానికి చెందిన పొట్లూరి సత్యనారాయణకు ఆరేండ్ల కిందట గృహలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి కూతురు సంతానం. సత్యనారాయణ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో వెల్డర్గా పనిచేసేవాడు. గత మే 27న వెల్డింగ్ పనులు చేస్తుండగా, కరెంట్ షాక్ కొట్టి.. రెండు చేతులు కోల్పోయాడు. దీంతో ఉపాధి లేక ఆ కుటుంబం రోడ్డున పడింది. స్నేహితుల సలహా..సహకారంతో సత్యనారాయణ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు తన దీనగాథను వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. బాధితుడి వివరాలను తెలుసుకొని.. డబుల్ బెడ్రూం ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే బాధితుడికి ఫోన్ చేసి.. ఇల్లు కేటాయిస్తున్నట్లు తెలుపుతూ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వద్దకు వెళ్లాలని సూచించారు. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని డబుల్ బెడ్రూం గృహ సముదాయంలో సత్యనారాయణ కుటుంబానికి రెండు పడకల గదిని కేటాయించారు. శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం జరిగింది. కష్టకాలంలో అండగా నిలిచిన మంత్రి కేటీఆర్కు, ఎమ్మెల్యే కృష్ణారావుకు, స్నేహితులకు జీవితాంతం రుణపడి ఉంటామని సత్యనారాయణ దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.