సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/ ఎల్బీనగర్: విశ్వనగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ. 54.71 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. జీహెచ్ఎంసీ ద్వారా రూ. 8 కోట్ల విలువైన 2 పనులు, హెచ్ఎండీఏ ద్వారా రూ.16.25 కోట్ల విలువ గల సర్వమత శ్మశాన వాటికలు, మరో 2 కోట్లతో వనస్థలిపురం వద్ద నిర్మించిన స్విమ్మింగ్ఫూల్, హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో రూ. 25.60 కోట్లతో పూర్తి చేసుకున్న పీర్జాదిగూడ లింకు రోడ్డును మంగళవారం మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు.
ఫతుల్లాగూడలో పెంపుడు జంతువుల శ్మశాన వాటిక
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో పెంపుడు జంతువుల శ్మశానవాటికను పీపుల్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి జీహెచ్ఎంపీ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన పీఎఫ్ఏ సంస్థ పెంపుడు జంతువుల శ్మశాన వాటిక తన స్వంత ఖర్చులతో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా జంతు పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నది.
ఎల్పీజీ గ్యాస్తో జంతు మృతదేహాల భస్మీకరణ
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్మాల్ యానిమల్ శ్మశాన వాటికలో ఎల్పీజీ గ్యాస్తో పెంపుడు జంతువుల మృతదేహాలను భస్మీకరణ చేస్తారు. ఎల్పీజీ గ్యాస్తో ఒకొక సైకిల్కు నాలుగు పెంపుడు కుకల దహనం చేసేందుకు సరాసరి 2 గంటల సమయం పడుతుంది. ఈ ఎల్పీజీ గ్యాస్ను తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆమోదం తెలిపింది. పెంపుడు జంతువుల దహన సంసారాలకు సంబంధిత యజమానుల నుంచి నామమాత్రంగా చార్జీలను పీపుల్ ఫర్ యానిమల్ సంస్థ వసూలు చేస్తుంది. జీహెచ్ఎంసీ రూ.33.50 లక్షలతో అవసరమైన వసతులు ఏర్పాటు చేయగా, పీపుల్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థ రూ. 51.25 లక్షల యంత్రాలు కొనుగోలు చేశారు.
ఎల్బీనగర్లో రూ. 122.33 కోట్ల ఎస్ఎన్డీపీ పనులు
లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న ఎస్ఎన్డీపీ ద్వారా నగరంలో రూ. 724 కోట్ల అంచనా వ్యయంతో 35 పనులను చేపట్టారు. ఎల్బీనగర్ జోన్లో ఎస్ఎన్డీపీ ద్వారా రూ.122.33 కోట్ల వ్యయంతో 9 నాలా అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో బండ్ల గూడ చెరువు నుంచి నాగోల్ వరకు రూ. 7.26 కోట్ల వ్యయంతో చేపట్టిన బాక్స్ డ్రైన్ పూర్తి కావడంతో అనేక కాలనీలకు ముంపు సమస్య లేకుండా పోతుంది. దీనిని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రజలకు అంకితం చేస్తున్నారు. బత్తుల చెరువు నుంచి ఇంజాపూర్ నాలా, రామంతాపూర్ చెరువు నుంచి ఇరిగేషన్ ఛానల్, సరూర్ నగర్ చెరువు నుంచి చైతన్యపురి కల్వర్టు అండ్ సింగరేణి కాలనీ నుంచి సరూర్ నగర్ లేక్, మన్సూరాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు, బండ్లగూడ చెరువు నుంచి మూసీ నది వరకు, చందానగర్ నుంచి సరూర్ నగర్ చెరువు, వంగ శంకరమ్మ చెరువు నుంచి సరూర్ నగర్ లేక్ వరకు పనులన్నింటినీ డిసెంబర్ వరకు పూర్తి చేయనున్నారు.
పీర్జాదిగూడ రోడ్డు ప్రారంభం
ఎల్బీనగర్ జోన్లో ఆటోనగర్ సమీపంలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి వయా మహవీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్ మీదుగా పీర్జాదిగూడ వరకు కారిడార్ 99 ద్వారా ప్యాకేజీ 2 ద్వారా మొత్తం 4.7 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. ప్యాకేజీ 1కు సంబంధించిన 2.60 కిలోమీటర్ల రోడ్డు రూ. 25.60 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి చేపట్టిన లింక్ రోడ్డు వలన బోడుప్పల్, పీర్జాదిగూడ, వరంగల్ జాతీయ రహదారికి ఎకేందుకు దూరం తగ్గుతుంది. అంతేకాకుండా పీర్జాదిగూడ నుండి నాగోల్ వరకు వెళ్లేందుకు దగ్గర రూట్ అవుతుంది.
లింకు రోడ్లకు అత్యంత ప్రాధాన్యత
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ద్వారా ఇప్పటి వరకు రూ. 757.26 కోట్ల రూపాయల విలువైన పనులను చేపట్టగా అన్ని పనులు పూర్తి దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రవాణా ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషి మేరకు రూ. 2,410 కోట్ల అంచనా వ్యయంతో 104 కారిడార్లు మిస్సింగ్ రోడ్ల అభివృద్ధి కోసం మంజూరు చేయగా అందులో అత్యంత ప్రాధాన్యతగా 5 ప్యాకేజీ ద్వారా రూ. 1500 కోట్ల విలువ గల 50 రోడ్లను చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులకు టెండర్లు పిలిచినట్లు అధికారులు వివరించారు.