వనస్థలిపురం, డిసెంబర్ 5 : వేలాది మంది ప్రజల సమస్యను తీర్చేందుకు 118జీవో తీసుకొస్తే బీజేపీ నాయకులు దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్ద కాలంగా రిజిస్టేషన్లు ఆగిపోయి ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నిరంతరం శ్రమించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో జీవో తీసుకొచ్చారన్నారు. దానిని జీర్ణించుకోలేని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఆ పార్టీ కార్పొరేటర్లు అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. జీవోలో ఇండ్లు ఉన్న ప్లాట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఖాళీ స్థలాలను చేర్చేందుకు మార్పులు చేయించడం జరుగుతుందన్నారు. కనీస అవగాహన లేని వ్యక్తులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇంటి పన్నులు 7శాతం తగ్గించినా తగ్గలేదని చెప్పడం అవగాహనా రాహిత్యమన్నారు.
సామరంగారెడ్డి ఎప్పుడూ సరిగా పన్నులు కట్టడని, అలాంటి వ్యక్తికి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఏనాడు కూడా రిజిస్టేషన్ల కోసం వినతిపత్రం, ఆందోళన వంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. అలాంటి వ్యక్తులు జీవో వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్నారన్నారు. రాద్దాంతం మానకపోతే ఆయా కాలనీల ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జీవోపై, పన్నుల తగ్గింపుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 10మంది కార్పొరేటర్లు ఉండి అభివృద్ధి చేయడం చేతగాక పనిలేక తిరుగుతున్నారన్నారు. పనిలేవారు చేసి విమర్శలను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు. టీఆర్ఎస్ బీఎన్రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, సంగీత, డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, కటికరెడ్డి అరవింద్రెడ్డి, అందోజు సత్యం చారి, ముడుపు రాజిరెడ్డి, మల్లారెడ్డి, చిరంజీవి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.