షేక్పేట్ డిసెంబర్ 5: టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి కుటుంబ సభ్యులు అని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం రాత్రి షేక్పేట్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుల,కార్యకర్తల కుటుంబసభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ఇంకా ఆదరణ పెరుగుతుందని,వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మల్లాంటి వారని, అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్,ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాట్ల పరిశీలన
నియోజకవర్గం పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏర్పాట్లపై హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలోనిర్వహించిన సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. బీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, శ్రీనివాస్, నాయకులు రాకేశ్, విలియం, షరీఫ్, జబ్బార్, మధు, బాబూరావు, జగన్ తదితరులతో ఎమ్మెల్యే మాగంటి చర్చించారు. క్రైస్తవులతో పాటు అందరూ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎక్కడా తక్కువ కాకుండా చూసుకోవాలని సూచించారు.