సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయిలో మనకో సవాలుగా నిలుస్తున్నాయి. సైబర్ దోపిడీలపై ఫిర్యాదు చేసేందుకు 1930 టోల్ఫ్రీ నంబరు ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అందుకే ప్రజల్లో ఈ సైబర్ నేరాల గురించి అవగాహన పెరగాలి.
హైదరాబాద్ నగరంలో సుమారుగా 8 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఐటీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్లు కూడా వేల సంఖ్యలో ఉంటారు. అన్నివైపుల నుంచి సహకారం అందుకునేలా పోలీసు వ్యవస్థలో సిటిజన్ పోలీసింగ్ను అమలు చేస్తున్నట్టే సైబర్ క్రైంలను నియంత్రించేందుకు ఐటీ ఉద్యోగుల సహకారం తీసుకుం దాం. వీలైనంత ఎక్కువ మంది సైబర్ వారియర్స్గా పనిచేసేలా వ్యవస్థలో మార్పులు చేద్దాం
‘ఎవరైనా మహిళ ఆపదలో ఉన్నప్పడు వారిని తక్షణం రక్షించేందుకు లేదా జరగబోయే దారుణాన్ని ఆపేందుకు డ్రోన్లను వినియోగిద్దాం. ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్ నుంచి డ్రోన్ బయలుదేరుతుంది. బటన్ నొక్కిన వారి లొకేషన్ గుర్తించి పోలీసులు చేరుకునేలోపు వారికన్నా ముందుగానే నిమిషాల్లో సైరన్ మోగిస్తూ అక్కడ వాలిపోతుంది. దీంతో నిందితులు బాధితురాలిపై అఘాయిత్యం చేయకుండా పోలీసులు వచ్చేలోపు రక్షించే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు కృషి చేద్దాం’ అంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని హోంమంత్రి మహమూద్ అలీ, ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సైబర్నేరాలపై అవగాహన పెంచేలా ఐటీ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ నవీన్కుమార్, హోంసెక్రటరీ రవి గుప్తా, ఏసీబీ డీజీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, సయాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డివిఆర్ మోహన్రెడ్డి, మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ అభిషేక్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళలు ఆపదలో ఉన్నప్పడు వారిని రక్షించేందుకు డ్రోన్లను వినియోగిద్దామని… ఫోన్లో ఎస్వోఎస్ బటన్ నొక్కగానే పోలీసులు చేరుకునేలోపు సైరన్ మోగిస్తూ డ్రోన్ వాలిపోతే బాధితురాలిపై అఘాయిత్యం జరుగకుండా రక్షించే అవకాశం ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని హోంమంత్రి మహమూద్ అలీ, ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి ప్రారంభించారు. అంతే కాకుండా విశ్రాంత డీఆర్డీవో నిపుణులు రామ్గణేశ్ స్థాపించిన ‘సైబర్ ఐ’ స్టార్టప్ ద్వారా రూపొందించిన ‘క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్’, సైబర్ నేరాల దర్యాప్తు, నియంత్రణ కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ వెబ్సైట్ను ప్రారంభించి, బుక్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డ్రోన్ పరిజ్ఞానం, సైబర్ సెక్యూరిటీ ఆలోచనల్లో ప్రజలను వీలైనంతగా భాగస్వాములను చేయాలని సూచించారు. డ్రోన్ల సహాయంతో మహిళలకు భద్రత కల్పించవచ్చంటూ ఒక మహిళ తనకు రెండు సంవత్సరాల క్రితం చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. ఈ విధానాన్ని ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని అధికారులను, హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విధానం విజయవంతమైతే ఇది దేశంలోనే ప్రయోగాత్మకంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అనేది ప్రజల జీవితాల్లో అంతర్భాగమైందన్నారు. ఇలాంటి ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద సవాలుగా మారిందన్నారు. సైబర్ నేరాలు నగరాలకే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ జరుగుతున్నట్లు తెలిపారు. చదువుకున్న వారు, మేధావులు, ఎంతో జాగ్రతగా ఉండే వారు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నట్లు తెలిపారు. అందుకని సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ టోల్ఫ్రీ నెంబర్ 1930 చాలా మందికి తెలియదని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
వ్యవస్థలను బలపర్చుకోవాలి
వ్యవస్థలను బలపర్చుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఉదాహరణకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కెమెరాలను వినియోగించడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడిపే వారు తప్పించుకునే పరిస్థితి లేదని, దీని వల్ల డీడీ నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు.
వారి జాబితాను రిజిస్టర్ చేయండి
సునీత కృష్ణన్ అనే ప్రముఖ ఎన్జీవో నుంచి తనకు ఒక అద్భుతమైన సలహా వచ్చిందని, లైంగిక దాడులకు పాల్పడే వారి జాబితాను రూపొందించి రిజిస్టర్లో పెట్టాలని ఆమె సలహా ఇచ్చిందన్నారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా హోంమంత్రి, డీజీపీ, పోలీసు అధికారులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన జాబితాలో ఉన్న వారికి ఎక్కడ కూడా ఉద్యోగం ఇవ్వకూడదని, దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని అన్నారు. అంతకుముందు హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నివారణకు దేశంలోనే తొలిసారిగా సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఫర్ సైబర్ సేఫ్టీని ప్రారంభించినట్లు, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 10లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, నేరాలకు పాల్పడి నిందితులు తప్పించుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ సర్కార్ పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, ఐఐటీ కార్యదర్శి జయేశ్రంజన్, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి , ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ నవీన్కుమార్, సయాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డీవీఆర్.మోహన్రెడ్డి, మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ అభిషేక్, రాజీవ్కుమార్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.