సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరం అంతర్జాతీయ నగరంగా అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన మౌలిక వసతుల కల్పన అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, లింకు రోడ్లకు దీటుగా సాధారణ పనులు కూడా అంతే వేగం అందుకున్నాయి. రహదారులు, ఫుట్పాత్ల అభివృద్ధి, ఎఫ్వోబీలు, వరద నీటి కాలువల బలోపేతం ఇలా నలుదిశల సమగ్ర అభివృద్ధితో మహానగరంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. 2022-23 సంవత్సరానికి 8024 పనుల కోసం రూ.2072.34 కోట్ల ఖర్చుకు పరిపాలన అనుమతి తీసుకోగా, ప్రస్తుతం రూ.528.78 కోట్లు వెచ్చించి 2651 ప్రాంతాల్లో పనులు పూర్తి చేశారు. రూ.1543.56కోట్లతో 5373 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని బల్దియా అధికారులు తెలిపారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే మన ముందున్న ప్రస్తుత లక్ష్యం. లివబుల్, లవబుల్ సిటీగా ఒక్కో మెట్టు ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. పెట్టుబడుల గమ్యస్థానంగా తనను తాను ఆవిష్కరించుకుంటున్నది. కోటిన్నర దాటిన జనాభా అవసరాలు తీర్చేందుకు, బృహత్తర ప్రణాళిలతో ముందుకు సాగుతున్నది. ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్డు, సీఆర్ఎంపీ వంటి ప్రాజెక్టులతో అప్రతిహాసంగా మౌలిక వసతులు రూపుదిద్దుకుంటున్నాయి. అయినా సాధించాల్సింది ఇంకా ఉంది. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా నగర రూపురేఖల్లో వచ్చిన మార్పులు, ఇక్కడ జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం..
విశ్వ నగరంగా ఎదిగిన హైదరాబాద్ మహా నగరంలో మౌలిక వసతుల కల్పన అంతకంతకూ పెరుగుతున్నది. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో ప్రగతి పరుగులు పెడుతున్నది. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్డు, సీఆర్ఎంపీ రోడ్లకు దీటుగా సాధారణ పనులు సైతం మిషన్ మోడ్లో నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే 2022-23 సంవత్సరానికిగాను 8024 పనులకు రూ.2072.34 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం రూ.528.78 కోట్లు ఖర్చు పెట్టి 2651 చోట్ల పనులను పూర్తి చేశారు. రూ.1543.56కోట్లతో 5373 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
2022-23 సంవత్సరానికి..!
2022-23 సంవత్సరానిగాను రూ.742.39 కోట్లతో 2807 చోట్ల రహదారులను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.185.20కోట్ల విలువ గల 681 చోట్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు.
ఫుట్పాత్ల అభివృద్ధి
పాదచారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. పాదచారులు చేరవలసిన గమ్యానికి సురక్షితంగా వెళ్లేందుకు దోహదపడే విధంగా ఫుట్పాత్లను ఏర్పాటు చేస్తున్నారు. 2014-15 సంవత్సరం నాటికి 452 కిలోమీటర్ల పొడవు ఉన్న పుట్పాత్లను 2022 సంవత్సరం నాటికి 816.90 కిలోమీటర్లకు పెంచారు. ఇందుకోసం రూ.61.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భాగంగానే 2022-23 సంవత్సరంలో ప్రమాదానికి గురవుతున్న ప్రాంతాలను గుర్తించి పాదచారులకు ఎలాంటి ప్రాణనష్టం కలుగకుండా రూ.31.11 కోట్లతో మరిన్ని చోట్ల ఫుట్పాత్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.10.04 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రూ.21.07 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే ఫిబ్రవరి నాటికి అన్ని పనులను పూర్తి చేసి బాటసారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాదచారుల కష్టాలకు చెక్ పెడుతూ ఎఫ్వోబీలు
ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల రద్దీ ఎకువగా ఉండడంతో ప్రయాణికులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. దానిని అధిగమించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. పాదచారుల సౌకర్యార్థం రూ.76.65 కోట్ల వ్యయంతో 22 చోట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా ఇందులో ఇప్పటికే రూ.23.10కోట్లతో తొమ్మిది చోట్ల ఎఫ్వోబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
గడిచిన కొన్నేళ్లుగా రహదారి అభివృద్ధి పనుల వివరాలు
జీహెచ్ఎంసీ పరిధిలో 9013 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ఇందులో 2846 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్వహణ జీహెచ్ఎంసీ చేపడుతున్నది.
681 చోట్ల పనులు పూర్తి
ఈ ఏడాది (2022-23)లో 2807 చోట్ల పనులకుగాను రూ.742.39 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.185.20కోట్లు ఖర్చు చేసి 681 చోట్ల పనులను పూర్తి చేసింది. మిగిలిన చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని అభివృద్ధి పనుల వివరాలు