బన్సీలాల్పేట్, నవంబర్ 28 : ఏండ్లుగా కనీస సదుపాయాలు లేకుండా బతుకుతున్న హమాలీ బస్తీలోని పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం పద్మారావునగర్లోని హమాలీ బస్తీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 30న జీహెచ్ఎంసీ అధికారులు అర్హులైన లబ్ధిదారుల జాబితాను బస్తీలో ప్రదర్శిస్తారని, వాటిలో ఏవైనా అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హుల పేర్లు లేకుంటే తగిన విచారణ చేసి, వారి పేర్లను కూడా జాబితాలో చేరుస్తామని తెలిపారు. బస్తీలో స్వయంగా పర్యటించిన సీఎం కేసీఆర్, ఇక్కడి ప్రజల బాధలను చూశారని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ఆదేశించారని పేర్కొన్నారు. పేద ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాలు, దుకాణాలు, పార్కింగ్ సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కే.హేమలత, టీఆర్ఎస్ ఇన్చార్జి జి. పవన్కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ వెంకట్దాస్ రెడ్డి, హమాలీ బస్తీ అధ్యక్షుడు సుభాష్, నాయకులు కుశాల్, దుర్గ, కౌసల్య, మల్లేశ్, నర్సింహ, సంపత్, వెంకటేశ్, చంద్రకళ, శారద పాల్గొన్నారు.