వారికి ఎండా, వాన, చలి, పండుగ పబ్బం అనే తేడా ఉండదు. అప్పగించిన బాధ్యతలను ఓ యజ్ఞంలా చేయడమే వారికి తెలిసిన విద్య. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రతలో తెల్లని మల్లెల వలే మెరిపించడమే వారి నిరంతర తపన..నిరంతరం సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న 19, 548 మంది పారిశుధ్య కార్మికుల పట్ల జీహెఎంసీ మానవీయంగా స్పందించింది. ఎముకలు కొరికే చలినుంచి పని వేళలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్య కార్మికులు ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా కర్తవ్యమే పరమావధిగా నిత్యం రహదారులు, నగర వీధులను శుభ్రపరచటంలో నిమగ్నమవుతుంటారు. తెల్లవారుజామునే రహదారుల వెంట చెత్తను శుభ్రం చేసే వారి పని ఎవరికి పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ, ఒకపూట నగరంలో పారిశుధ్య సేవలు నిలిస్తే మాత్రం పరిస్థితి కడు దుర్భరం. మరీ ముఖ్యంగా కరోనా విలయతాండవం చేసిన సమయంలో సఫాయి కార్మికుల సేవలు చిరస్మరణీయం. మీకోసం మేమున్నాం.. మీరు మాత్రం ఇండ్లలోనే జాగ్రత్తగా ఉండండి అంటూ ముందుకు వచ్చి పనిచేసిన పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు వారి బాగుగోలు చూస్తున్నది. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూనే విధి నిర్వహణలో అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే తాజాగా పనివేళల్లో సడలింపు ఇచ్చారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత దృష్ట్యా తెల్లవారు జామున 5 గంటలకు బదులుగా 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయ వేళలను మార్చారు. చలికాలం ముగింపు వరకు ఈవేళలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.