మేడ్చల్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన 176 పాఠశాలలో జరుగుతున్న 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. రూ. 30 లక్షల పైచిలుకు నిధులతో చేపట్టాల్సిన 36 పాఠశాలలో టెండర్ల పక్రియను పూర్తి చేశారు. టెండర్లు పూర్తయిన పాఠశాలలో పనులను వారం రోజులలో ప్రారంభించనున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని 15 మండలాలలో 176 పాఠశాలల అభివృద్ధికి గాను రూ. 70 కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన 30 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని 15 మండలాలలో మండలానికి 2 పాఠశాలలో చొప్పున పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం అయ్యాయి. ఇందులో 22 పాఠశాలలకు రంగులు పూర్తి చేశారు. మరో 8 పాఠశాలలకు రంగులు పూర్తయిన వెంటనే ఫర్నిచర్ను అమర్చి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
36 పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం
36 పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. రూ. 30 లక్షల పైచిలుకు నిధులను వెచ్చించే 36 పాఠశాలల టెండర్ పక్రియ పూర్తయింది. పనుల ప్రారంభించేలా ఆర్అండ్బీ ఈఈ, డీఈ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించాం. జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్య్త పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నాం.
– విజయకుమారి,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీఈవో