జీడిమెట్ల, నవంబర్ 22: పరీక్షల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్గాంధీనగర్కు చెందిన లాలు, కరుణ దంపతులకు మురళి(19) ఒక్కగానొక్క కుమారుడు. మురళి బాలానగర్లోని సీఐటీడీలో డిప్లమో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే.. మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్ట్ల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మురళి సోమవారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు అతని కోసం చుట్టుపక్కల, స్నేహితుల ఇండ్లలో గాలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ సముదాయం వద్ద మురళి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా రాజీవ్ స్వగృహ 14వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగిపోయారు.