మువ్వన్నల జెండా మురిసింది. దేశభక్తి ఉప్పొంగింది. భారత్మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్.. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. సబ్బండ వర్గాలు దేశఖ్యాతిని ఎలుగెత్తి చాటాయి. ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు స్వాతంత్య్ర స్ఫూర్తిని పెంచి.. దేశ కీర్తిని పెంచాయి. వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కేకే అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల వారసులను, పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని ఖండాంతరాలకు ఎలుగెత్తి చాటిన క్రీడాకారులతో పాటు ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత కచేరి, దీపికారెడ్డి బృందం ఝాన్సీలక్ష్మీబాయి జీవిత చరిత్రపై నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఉర్రూతలూగించింది. అంతేకాకుండా వివిధ ఘటనలకు సంబంధించిన లఘు వీడియోలతో పాటు లేజర్ షోను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పటాకులు పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మువ్వన్నెల జెండా రెపరెపల మధ్య స్వతంత్ర పోరాటయోధులను స్మరిస్తూ.. మహాత్మాగాంధీకి జై, భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై తెలంగాణ అంటూ వేల గొంతుకలు నినదించాయి. వేలాది మంది కరతాళ ధ్వనుల మధ్య సోమవారం మధ్నాహ్నం ఎల్బీ స్టేడియంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తేజోమయంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని నడిబొడ్డున వజ్రోత్సవానికి కదిలారు.
వేడుకల ముగింపు సందర్భంగా ప్రతి వీధినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి మదిలో దేశభక్తి ఉప్పొంగింది. జాతీయ, అంతర్జాతీయ కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే. కేశవరావు అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకలకు తెలంగాణ నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన వారినుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించి, తెలంగాణ కీర్తిని ఖండాంతరాలకు ఎలుగెత్తి చాటిన క్రీడాకారులతో పాటు ప్రముఖులను సీఎం కేసీఆర్ సన్మానించారు.
దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలు జరిగాయి. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత కచేరీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి బృందం ఝాన్సీలక్ష్మీబాయి జీవిత చరిత్రపై నృత్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. మల్లేశ్-మస్తాన్ భాయి, భాయి, గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా నిలిచేవిధంగా వార్సీ బ్రదర్స్ ఖవ్వాలితో పాటు పలువురు కళాకారుల ప్రదర్శనలు ఇచ్చారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా లేజర్ షోతో పాటు భారీ ఎత్తున పటాకులు పేల్చారు.
రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 30వేల మంది ముగింపు ఉత్సవాల్లో పాల్గొనే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కట్టిపడేసిన ఖవ్వాలీ మొఘల్ దర్బార్ గాయకుడు, నిజాం ఆస్థాన గాయకుడు మహ్మద్ సిద్ధిఖాన్ వారసులు వార్సీ బ్రదర్స్ ఖవ్వాలీ కార్యక్రమంతో ఆద్యంతం సభికులను మైమరిపింపజేశారు. మతం విద్వేషం పునాది మీద కాకుండా నైతికత అనే పునాది మీద, పరస్పర ఐక్యతతో ఉండాలని ఖవ్వాలీతో అలరించారు.
సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు దీపికారెడ్డి ఆధ్వర్యంలో వజ్రభారతి నృత్యరూపకల్పన, ఝాన్సీలక్ష్మీబాయి వీరోచిత పోరాట దృశ్యాలను కళాకారులు ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాట సన్నివేశాలను బ్రిటీష్ వారి అరాచకాలను కండ్లకు కట్టినట్టుగా కళాకారులు ప్రదర్శించారు.
ప్రముఖ స్వరకర్త, గాయకుడు శంకర్ మహదేవన్ సభలో తన గాత్రంతో సభికులను మాధుర్యంలో ఓలలాడించారు. ‘వక్రతుండ మహాకాయ.. సూర్యకోటి సమాప్రభ’ అంటూ ఆలపించి సభలో ఆధ్యాత్మిక వాతావరణం పూయించారు. నమస్కారం తెలంగాణ అంటూ ఒక్కసారిగా నినదించి హోరెత్తించారు. వజ్రోత్సవాలు ఘనంగా జరపడం జీవితంలో మరిచిపోలేని ఈవెంట్ అని, తెలంగాణకు కృతజ్ఞతలు చెప్పారు.
సూర్యాపేటకు చెందిన రాముయాదవ్ జాతీయ జెండా పట్టుకున్నట్టుగా చిత్రపటాన్ని శరీరంపై అద్దుకుని ప్రత్యేకంగా నిలిచారు.