మేడ్చల్ జోన్ బృందం, జనవరి 31 : జ్వర సర్వే సోమవారం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటంటా కొనసాగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో చేసిన సర్వేలో జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఆరోగ్య సిబ్బంది మందుల కిట్లను పంపిణీ చేశారు.
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి
ఘట్కేసర్ రూరల్, జనవరి 31: ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్రెడ్డి సూచించారు. మండల పరిధి అవుషాపూర్ పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో సర్పంచ్ ఏనుగు కావేరితోపాటు కార్యదర్శి ఉమాదేవి సోమవారం పర్యటించి వ్యాక్సిన్ వేయించుకోని వారి వివరాలతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
28మందికి కరోనా
కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 330 మందికి కొవిడ్ పరీక్షలు చేశామని, వారిలో 28 మందికి కరోనా సోకిందని డాక్టర్ సరిత తెలిపారు. కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 15 మందికి, రాంపల్లి సబ్సెంటర్లో 1, నాగారం సబ్సెంటర్లో 11మందికి కరోనా సోకిందన్నారు.
వ్యాక్సినేషన్ను వేగవంతం చేస్తున్నాం
చర్లపల్లి డివిజన్ పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.