సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): దక్కన్ దళితోద్యమాలకు మార్గదర్శి.. వందేండ్ల కిందటే బాలికా విద్య కోసం పాఠశాలలను స్థాపించిన సంఘ సంస్కర్త.. గాంధీజీ, అంబేద్కర్ కంటే ముందే సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచాలను రూపుమాపేందుకు ఉద్యమించిన ధ్రువతార.. “అంటరానివారం కాదు.. పంచములం అంతకన్నా కాదు.. మేము ఆదిజనులం. ఈ దేశ మూలవాసులం” అంటూ హైదరాబాద్ గడ్డపై భాగ్యోదయమై వెలిసిన చైతన్య దీపిక.. తెలంగాణ తొలితరం సంఘసంస్కర్తల్లో అగ్రగణ్యుడు భాగ్యరెడ్డి వర్మ. దళితవర్గాలకు చదువు చెప్పడంతో పాటు అస్పృశ్యత నిర్మూలన, హింసావాదాన్ని వీడాలంటూ ఎన్నో సమాజహిత కార్యక్రమాలు చేపట్టిన భాగ్యవర్మ 134వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం మే 22న అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, దక్కన్ నేలకు చేసిన సేవపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
18 ఏండ్ల ప్రాయంలోనే జగన్ మిత్ర మండలి ఏర్పాటు
1888 మే 22న చాదర్ఘాట్లోని ఇసామియా బజార్లో వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించిన భాగ్యరెడ్డి వర్మ తన 18వ యేట (1906) జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేశారు. హరిదాసులు, మాల జంగాల చేత హరికథలు చెప్పించి అట్టడుగు వర్గాలను చైతన్య పరిచారు. ఆ తర్వాత మన్య సంఘం పేరుతో అసమానతలు, మూఢ విశ్వాసాలు, దురాచారాలు, దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాన్ని విస్తృతం చేశారు. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ముందుకుసాగారు. అంతేకాదు బ్రహ్మసమాజం, డెక్కన్ హ్యుమనిటేరియన్ లీగ్తో పాటు అనేక హిందూ సంస్థలతో కలిసి పని చేశారు. 1913లో బౌద్ధాన్ని స్వీకరించి ప్రతి సంవత్సరం బుద్ధ జయంతిని నిర్వహించి అహింసావాదాన్ని పాటించాలని, చతుర్వర్ణ వ్యవస్థ, వైదిక ధర్మాన్ని నిరసిస్తూ బౌద్ధ ప్రచారాన్ని చేపట్టారు. 1919లో ఆదిహిందూ సమ్మేళనాన్ని నిర్వహించి జంగములు, మాల దాసరులతో పాటు దళిత ఉపకులాల మధ్య సమన్వయం కోసం నడుం బిగించారు. ఆదిహిందూ చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు 1925లో వస్తు ప్రదర్శన నిర్వహించి వారి పనితనాన్ని ప్రపంచానికి తెలియజేశారు. భాగ్యరెడ్డి వర్మ సేవలకు గుర్తింపుగా ఆర్య సమాజం వర్మ అనే బిరుదును ప్రకటించింది.
పాఠశాలల ఏర్పాటు..
దళితులను అంటరానివారిగా చూడటమే కాకుండా.. వారికి విద్యను నిరాకరిస్తున్న సమయంలో తానే స్వయంగా పాఠశాలలను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలు వాటిని నడిపించారు. 1926 నుంచి 1930 వరకు ఫలక్నుమా నుంచి బొల్లారం వరకు 26 తెలుగు మీడియం పాఠశాలలను నెలకొల్పినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. అవిద్య, అంటరానితనం, జోగిని లాంటి దురాచారాలను రూపుమాపడంలో భాగ్యరెడ్డి వర్మ అలుపెరుగని పోరాటం చేశారు. ఆయన చేసిన కృషి మూలంగానే నిజాం నవాబు జోగిని వ్యవస్థపై నిషేధం విధించారు. అంతేకాక ఆయన అనారోగ్యానికి గురై పాఠశాలలను నడపలేని స్థితిలో ఉన్నప్పుడు 26 పాఠశాలల్లో మాతృభాషను బోధించాలని షరతు విధించగా అందుకు అంగీకరించిన నిజాం పాఠశాలల బాధ్యతను తీసుకొని విద్యాశాఖలో కలిపి కొనసాగించారు.
ఇప్పటికీ అదే స్ఫూర్తితో..
ఎందరో జీవితాల్లో అక్షరజ్యోతి వెలిగించిన ఆదిహిందూ భవన్ (1925లో పురుడు పోసుకున్నది) ఇప్పటికీ అదే స్ఫూర్తితో వెలుగొందుతున్నది. అనేక మంది జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని నింపిన ఘనత ఆ భవన్ సొంతం. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆ పాఠశాలలోనే విద్యను అభ్యసించినట్లు భాగ్యరెడ్డి వర్మ మనువడు అజయ్ గౌతం తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆశయం, చైతన్యానికి నిలువుటద్దంలా ఇప్పటికీ చాదర్ఘాట్ సిగ్నల్ పక్కనే (భాగ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల) ఉన్న ఆదిహిందూ భవన్ భాగ్యోదయంగా కొనసాగుతూనే ఉంది.
ప్లేగుపై స్వస్థ్దళ్తో సేవ..
1912లో భాగ్యనగరంలో ప్లేగు ప్రబలినప్పుడు స్వస్థ్దళ్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. చివరికి మృతదేహాలకు స్వయంగా అంతిమసంస్కారాలు నిర్వహించారు. దీంతో అప్పటి నిజాం ఆయన సేవల్ని గుర్తించి ప్రశంసించకుండా ఉండలేకపోయాడంటే భాగ్యరెడ్డి వర్మ కృషిని అంచనా వేయొచ్చు.
పాత్రికేయుడిగా, రచయితగా..
భాగ్యరెడ్డి వర్మ కేవలం సంఘసంస్కర్త మాత్రమే కాదు… పాత్రికేయుడు, రచయిత కూడా. తాను రాసిన ‘వెట్టి మాదిగ’ కథ 1931లో భాగ్యనగర్ పత్రికలో ప్రచురితమైంది. భాగ్యనగర్ (ఆదిహిందూ), పంచమ పత్రికలను నడిపించారు. అప్పటి ఉద్యమానికి ఆ పత్రికలను కరదీపికలుగా మలిచి ప్రజలను మేల్కొపారు. హైదరాబాద్లో ఆయన చేపట్టిన సంఘసంస్కరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రభావం చూపింది.
స్వరాష్ట్రంలోనే భాగ్యరెడ్డి వర్మకు గుర్తింపు
భాగ్యరెడ్డి వర్మ సేవలను ఇంతవరకూ ఏ ప్రభుత్వం గుర్తించలేదు. తెలంగాణ సాధన తర్వాత 2018 నుంచి అధికారికంగా ప్రభుత్వం జయంత్యుత్సోవాలను నిర్వహిస్తున్నది. 8వ తరగతి సాంఘికశాస్త్రం, 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో భాగ్యరెడ్డి వర్మ జీవితం, పోరాటం, సేవలు, చరిత్రను చేర్చారు. 2017లో తెలుగు మహాసభలు నిర్వహించిన సందర్భంలో కూడా ఆయన త్యాగాన్ని తెలంగాణ సమాజం స్మరించుకుంది. ఆయన పోరాటం, సంఘ సంస్కరణల కోసం చేసిన కృషిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– అజయ్ గౌతం, భాగ్యరెడ్డి వర్మ మనుమడు
దళిత ఉద్యమాలకు వారధి
దక్షిణ భారతదేశంలోనే పండిత అయోతిదాస్, అయ్యంకాళీ సమకాలికుడైన భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ రాష్ట్రంలో దళిత ఉద్యమానికి ఒక సంఘటితమైన పునాదిని వేశారు. కేవలం ఉద్యమాలు మాత్రమే కాకుండా విద్య, ఆరోగ్యం, ఆర్థిక పరమైన అంశాలపై కార్యాచరణను చేపట్టారు. నిజాం కాలంలోనే అనేక పాఠశాలలను ప్రారంభించి అక్షర జ్ఞానాన్ని పంచారు. అప్పుడు.. ఇప్పుడు.. దళిత ఉద్యమాలకు మార్గదర్శకుడిగా నిలుస్తారు. ఈ రోజు దళిత ఉద్యమం కొనసాగించలేని విధానాలను ఆయన ఎప్పుడో చేపట్టారు. వనరుల కొరత ఉన్నా దళితులను చైతన్యం చేయాలన్న పట్టుదలే ఆయనను ముందుకు నడిపించింది.
– మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి
బుద్ధుడి జయంతిని నిర్వహించిన తొలి నేత
తెలుగు నేలపై మొదటిసారి బుద్ధుడి జయంతిని నిర్వహించిన తొలి ఉద్యమకారుడు భాగ్యరెడ్డివర్మ. దయ, కరుణ, మైత్రి భావనను నింపిన మానవతావాదిగా నిలిచారు. ఆయన ఆశయాలు, విధానాలు నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తుదిశ్వాస వరకు అలుపెరుగకుండా పనిచేసిన త్యాగశీలి. ఉన్నత వర్గాలకే పరిమితమైన విద్యను అంటరాని అభాగ్యులకు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన దివిటి. హైదరాబాద్లో భాగ్యరెడ్డివర్మ స్మృతివనం ఏర్పాటు చేయాలి.
– గనుమల జ్ఞానేశ్వర్, బుద్ధిస్ట్ కార్యకర్త
తెలుగు నేల వేగుచుక్క..
దళితుల వెతలను తీర్చిన వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ. అంటరానితనాన్ని, అనాగరిక ఆచారాలను తలదన్నే కార్యక్రమాలను రూపొందించి అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. భాగ్యరెడ్డివర్మ చేపట్టిన సంస్కరణలు నిజాం రాజును సైతం ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. ఇంతటి గొప్ప నాయకుడిని జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉంది.
– మంచాల లింగస్వామి,ఓయూ అధ్యాపకుడు