సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన నేపథ్యంలో ఓటరు జాబితాలో ముందుగా మీ పేరు ఉందో లేదో ఈసీఐ వెబ్సైట్ https://voters.eci.gov.in/ ద్వారా కానీ voter helpline యాప్ డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఈఆర్వో, ఏఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్లను సంప్రదించాలని లేదా వెబ్సైట్, ఓటరు హెల్ప్లైన్లో తిరిగి నమోదు చేసుకోవాలన్నారు.
ఫారం-6 : 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు, అక్టోబరు 1, 2023నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలి.
ఫారం-6బీ : ఓటరు జాబితాలో ఆధార్ను అనుసంధానం/ఆప్డేట్
ఫారం-7 : ముసాయిదా ఓటరు జాబితా పేరు తొలగింపు, అభ్యంతరాలు
ఫారం-8 (సవరణలు) : ముసాయిదా ఓటరు జాబితాలో పేరులో తప్పులు, ఇంటి నెంబరు తప్పుగా ఉన్నప్పుడు, ప్రామాణికంగా లేని ఇంటి నంబరు, అడ్రస్ మారినప్పుడు, ఓటరు జాబితాలో మిస్మ్యాచ్ ఫొటోలు, సక్రమంగా లేని ఫొటోలు, కుటుంబ సభ్యుల రిలేషన్ తప్పుగా నమోదైనచో (తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు), ఒకే కుటుంబ సభ్యులు ఆదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్లో ఉన్నచో, కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు నియోజకవర్గంలో నమోదు అయినచో, మొబైల్ నెంబరు ఆప్డేట్, ఇంకా తదితర తప్పులు సవరించుకోవడానికి ఈ నెల 19లోపు ఫారం-8తో దరఖాస్తు చేసుకోవాలని రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.