సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బస్సు రవాణా సేవలను ప్రత్యేకంగా అందిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ ఈ నెల 13న సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ బస్ పరేడ్ను నిర్వహిస్తున్నది. అందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ మేరకు నిర్వహించనున్న కవాతులో మ్యూజిక్ బ్యాండ్, మోటార్ సైకిళ్లు, 1932లో ప్రారంభించిన లండన్ నుంచి దిగుమతి చేసుకున్న పురాతన అల్బియస్ బస్సును అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. రోటరీ పార్కు నుంచి వివేకానంద విగ్రహం వద్ద దీనికి జెండా ఊపి ప్రారంభిస్తారు.
ఈ కవాతు అంబేద్కర్ విగ్రహం వద్ద ముగియనున్నది. వెయ్యి మందికి పైగా పబ్లిక్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ప్యాట్రన్స్, ఆర్టీసీ సిబ్బందితో పాటు ఇతరులు కూడా కవాతులో పాల్గొనే అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ సీఎండీ వీసీ సజ్జనార్ సంయుక్తంగా మాట్లాడుతూ, ఆర్టీసీ సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ఇలాంటి విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.