హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నది. ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం పర్యవేక్షించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. సాధారణ సమయాలలో అసెంబ్లీ నుంచి బంజారాహిల్స్కు వారం రోజుల క్రితం 15 నిమిషాలలో వచ్చే ద్విచక్రవాహనదారుడికి, నేడు 35 నిమిషాల సమయం పడుతున్నది. రద్దీ సమయాలలో అయితే ఈ సమయం మరింతగా పెరుగుతున్నది. క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సిబ్బంది తక్కువ సంఖ్యలో రోడ్లపై కన్పిస్తున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజులుగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సమస్య పెరుగుతుందనే వాదన విన్పిస్తుంది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
Hyderabad Traffic | సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు జఠిలమవుతున్నాయి. సమస్య ఎందుకు పెరుగుతున్నది.. దానిని పరిష్కరించడం ఎలా అనే విషయాన్ని ఎప్పకటిప్పుడు అధికార యంత్రాంగం పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. వారం రోజుల కిందట..సాధారణ సమయంలోనే అసెంబ్లీ వద్ద నుంచి బంజారాహిల్స్కు 15 నిమిషాల్లో వచ్చే ద్విచక్రవాహనదారుడికి, ఇప్పుడు 35 నిమిషాల సమయం పడుతున్నది. రద్దీ సమయాల్లో అయితే ఈ సమయం మరింతగా పెరుగుతున్నది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సిబ్బంది తక్కువ సంఖ్యలో రోడ్లపై కన్పిస్తున్నారు.. దీనికి పలు రకాల కారణాలున్నాయంటూ స్వయంగా ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. గతంలో ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగినా.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటూ వచ్చేవారు. వర్షం పడిన సమయాల్లో తప్ప..మిగతా రోజు వాహనాలు సాఫీగా వెళ్లిపోయేవి. వారం రోజులుగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సమస్య పెరుగుతున్నదనే వాదన వినిపిస్తున్నది.
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఒక గంట పాటు నిర్లక్ష్యం వహించినా ట్రాఫిక్ జామ్ అయి దాని ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా పడుతుంది. దీంతో నగరంలో ఉన్న ముఖ్య కూడళ్లలో ఉండే సిబ్బంది అలర్ట్గా ఉండాలి. సిబ్బందికి తోడుగా ప్రధాన కూడళ్లలో ఆటోమెటిక్ సీసీ కెమెరాలు పనిచేస్తూ ట్రాఫిక్ అలర్ట్స్ను జారీ చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వాటిపై సిబ్బంది దృష్టి పెట్టడం లేదనే విమర్శ వస్తున్నది. సమస్య ఎక్కడుంది..? ఆ సమస్యకు పరిష్కారమేమి అని క్షేత్ర స్థాయి సిబ్బందిని అడిగే నాథుడు కరువయ్యాడు.
ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో ప్రముఖులే ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఇలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ట్రాఫ్క్ రద్దీ ఏర్పడగానే కంట్రోల్ రూం నుంచి సమాచారం అందుకొని అక్కడకు కానిస్టేబుల్, హోంగార్డు లాంటి సిబ్బంది వాలిపోతున్నారు. వాళ్లు వచ్చే వరకు ఆ కూడలిలో ట్రాఫిక్ నిండిపోతున్నది. నాంపల్లి, ఆబిడ్స్, చాదర్ఘాట్, టోలిచౌక్, మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్డు నం. 1, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్పేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏమైంది ఈ నగరానికంటూ వాహనదారులు చర్చించుకోవడం కనిపించింది. ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంపైనే దృష్టి పెడితే, ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉండవని నగర పౌరులు సూచిస్తున్నారు.