హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రూ.1.22 కోట్ల పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును దారి మళ్లించేందుకు ఉపయోగించే మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను నిందితులు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రూ.1.22 కోట్ల పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును దారి మళ్లించడానికి ఉపయోగించే మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను నిందితులు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఖాతాలను ఆన్లైన్ ట్రేడింగ్, మనీలాండరింగ్ కార్యకలాపాలకు ఉపయోగించినట్లు సమాచారం. సైబర్ మోసాలకు సహకరిస్తున్న ఆర్థిక నెట్వర్క్లను అణిచివేయడంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈ ఆరుగురిని అరెస్ట్ చేశారు.
అరస్టైన వారిలో బేగంపేట, చంపాపేట్, వనపర్తిలకు చెందిన వారు ముగ్గురు ఉండగా, ఒకరు అనంతపురం, మరో ఇద్దరు మహారాష్ట్రలోని పర్బనికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. జనవరి నెలలో హైదరాబాద్కు చెందిన ఒక బాధితుడిని ఒక వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు ద్వారా మోసగాళ్లు సంప్రదించారు. అధిక లాభాలు, ఐపీఓ కేటాయింపులు జరుగుతాయని నమ్మించి నకిలీ ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడి పెట్టేలా చేశారు. బాధితుడికి నమ్మకం కలిగించడం కోసం మొదట్లో రూ.1.05లక్షలు విత్ డ్రా చేయడానికి అనుమతించారు.

H Cyber
ఆ తర్వాత బాధితుడు 19 లావాదేవీల ద్వారా రూ.1.22కోట్లు పెట్టుబడి పెట్టాడు. మోసగాళ్లు తమ నకిలీ ప్లాట్ఫామ్లో రూ.15.69కోట్ల లాభం వచ్చినట్లు చూపించి ఆ ఐపీఓలను విడుదల చేయడానికి అదనంగా మరో రూ.35లక్షలు డిమాండ్ చేశారు. పోలీసు దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం కీలక నిందితుల్లో ఒకరు అధిక విలువ కలిగిన కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరవడమే ధ్యేయంగా కంపెనీ స్థాపించారు. ఆ పై సదరు ఖాతాల ఇంటర్నెట్ బ్యాంకింగ్ అధికారిక వివరాలను ఇతర వ్యక్తులకు పంచుకున్నాడు.
ఈ ఖాతాలను సైబర్ నేరాల ద్వారా వచ్చే సొమ్మును దారి మళ్లించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే వసూళ్లు దాచడానికి ఉపయోగించారు. అంతేకాకుండా నిజమైన వ్యాపార ఖాతాలను కమీషన్ ఆధారిత అగ్రిమెంట్లతో సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు బ్యాంక్ ఖాతాలను సరఫరా చేయడం ద్వారా కమీషన్లు సంపాదించేవారని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో చంపాపేటకు చెందిన నిందితుడు సరఫరా చేసిన ఒక యెస్ బ్యాంకు ఖాతాకు దేశవ్యాప్తంగా 26 కేసులతో సంబంధం ఉన్నదని, ఇందులో 4 కేసులు తెలంగాణకు చెందినవేనని చెప్పారు.
ఈ ఖాతా లావాదేవీలను చూస్తే రూ.1.10కోట్లు , పర్బణికి చెందిన మరో ఇద్దరు నిందితులు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతా దేశవ్యాప్తంగా 18 కేసులలో ఉండగా వీటి ద్వారా రూ.3.37కోట్లు దారిమళ్లించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలా బ్యాంకు ఖాతాలను సమకూర్చడంలో నిందితుల క్రియాశీల భాగస్వామ్యం ఉందని తెలిపారు. నిందితులనుంచి మూడు మొబైల్ఫోన్లు, నాలుగు ఏటీఎం కార్డులు, రెండు చెక్ బుక్స్, రెండు బ్యాంకు పాస్బుక్కులు, మూడు ఎయిర్టెల్ సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్బాబు ఆధ్వర్యంలో ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ వై గౌరినాయుడు నేతృత్వంలోని సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్ బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. రికవరీ చేయడంలో ఎస్ఐ కె. హిమారెడ్డి, హెడ్కానిస్టేబుల్ సునీల్, కానిస్టేబుళ్లు సాయినాథ్, అశోక్, రాజేందర్, డీ.మీనా కీలకపాత్ర పోషించారని, ఈ సైబర్ క్రైమ్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.