హైదరాబాద్ : ‘కౌన్ బనేగా కరోడ్పతి’ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పలువురి వద్ద రూ. కోట్లలో వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నపాట్నా వాసి రాకేశ్ను బీహార్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిందితులపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
గతేడాది ఖైరతాబాద్కు చెందిన ఓ మహిళకు లాటరీ గెలిచారని సందేశం పంపాడు. నగదు విత్ డ్రా కోసం పలు రకాల ఛార్జీలు కట్టాలని ఆమెకు తెలిపాడు. రూ. 25 లక్షల లాటరీ కోసం రూ. 39 లక్షలు చెల్లించింది బాధితురాలు. ఇక లాటరీ డబ్బులు పంపమని అడిగినప్పుడు సమాధానం దాట వేయడంతో తాను మోసపోయానని గ్రహించి, బాధితురాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడు రాకేశ్ను బీహార్లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 16 సెల్ఫోన్లు, 73 డెబిట్ కార్డులు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా రాకేశ్ రూ. 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓటీపీ ద్వారా మోసగిస్తున్న మరో 11 మందిని అరెస్టు చేసినట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. రివార్డ్ పాయింట్ల గడువు ముగుస్తుందని పలువురు ఖాతాదారులకు నిందితులు ఫోన్ చేస్తారు. రిడీమ్ చేసుకోవాలని సందేశం పంపి ఓటీపీ అడుగుతారు. ఈ విధంగా గత నెల కంచన్బాగ్కు చెందిన ఓ మహిళ వద్ద రూ. లక్ష కాజేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నోయిడాలోని కాల్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. నలుగురు యువతుల వద్ద 25 సెల్ఫోన్లు, 10 ల్యాప్టాప్లను సీజ్ చేశారు.