సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : లోకసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రజాప్రతినిధులతో కలిసి రోజుకో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వాకర్స్తో సమావేశాలు, నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు శ్రేణులతో సమన్వయ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉంటే..బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కనీస ప్రచారంలో లేరు. దీంతో ఆ రెండు పార్టీల్లోనూ స్తబ్ధత నెలకొన్నది.
మొత్తంగా లష్కర్పై గులాబీ జెండా ఎగురవేయడంతో పాటు మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా కార్యాచరణతో క్యాంపెయిన్ చేస్తున్నది. ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, సనత్నగర్, ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. శనివారం సనత్నగర్లో, 7న ఖైరతాబాద్, 8న నాంపల్లి, 10న అంబర్పేట నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధ్దం చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలో గులాబీ సత్తా చాటేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.