ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా.. అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా.. శాంతిభద్రతలు అత్యంత కీలకం. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించింది. ఈ నేపథ్యంలోనే పటిష్ట శాంతిభద్రతలు కల్పించడంతో పాటు నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ.. నగర పోలీసులు చక్కటి విజయాలను సాధిస్తున్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు సేవలు అందిస్తూ.. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ సురక్షితమైన నగరంగా పేరు తెచ్చుకున్నది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడితో పాటు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల పోలీసులు సైతం తెలంగాణలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయంటూ కితాబిస్తున్నారు. -సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టెక్నాలజీ పరమైన సంస్కరణలతో నేరస్తులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్లతో ప్రజల సమస్యలు తీర్చే ఆపద్బంధవులుగా పోలీసులు పేరు తెచ్చుకున్నారు. 9 ఏండ్ల కాలంలో హైదరాబాద్లో ఒక్క కుల, మత, రాజకీయ పరమైన అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన శాంతి భద్రతలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. దీంతో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రై పోలీస్ కమిషనరేట్లలోని సీసీ కెమెరాలు అనుసంధామయ్యాయి. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర నుంచి అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో పటిష్టమైన శాంతి భధ్రతలతోనే ప్రపంచ దేశాలు నేడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పోలీసు వ్యవస్థను ఆధునీకరించి, టెక్నాలజీ పరమైన సంస్కరణలు ప్రవేశ పెట్టి హైదరాబాద్ను ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆయన విజన్తో నేడు హైదరాబాద్ ప్రజలు సురక్షితమైన నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. స్వరాష్ట్రంలో టెక్నాలజీ పరమైన సంస్కరణలతో పోలీసు శాఖ అద్భుత ఫలితాలను సాధించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నది. నేరం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాక ముందు 10 నుంచి 15 శాతం ఉండే శిక్షల శాతం, నేడు 50 నుంచి 70 శాతానికి పెరిగింది.
నేరాలు జరగకుండా సాంకేతిక పరంగా సంస్కరణలు చేస్తూ.. నేరస్తులపై ఉక్కుపాదం మోపారు. నేరాలు చేసే వారికి హైదరాబాద్లో చోటు లేదనే విషయాన్ని నేరస్తులకు తెలిసేలా.. నేర ప్రవృత్తిని మానుకోకుండా దొంగతనాలు, దోపిడీలు, గుండాయిజం, రౌడీయిజం, కులాలు, మతాల మధ్య ద్వేషాలు సృష్టించేందుకు కుట్ర చేసే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వరుసగా నేరం చేసే వారిపై పీడీయాక్ట్లు ప్రయోగించారు. 2000 మందికిపైగా నేరస్తులపై పీడీయాక్ట్లు విధించారు. ఇందులో అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నేరస్తులతో పాటు స్థానిక నేరస్తులున్నారు. వ్యవస్థీకృత నేరాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. దీంతో పేకాట క్లబ్బులు, గుడుంబా విక్రయాలు, మట్కా, జూదం, రౌడీయిజం, గుండాయిజం వంటివి కనిపించకుండా చేశారు. గుడుంబా విక్రయాలు చేసే వారిలో మార్పు తెచ్చి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా పునరావాస కార్యక్రమాలతో వారికి జీవనోపాధి కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.
2014కు ముందు వరుస చైన్ స్నాచింగ్లతో మహిళలు రోడ్లపైకి వెళ్లాలంటే భయపడేవాళ్లు.. గుడికి వెళ్లాలన్నా… ఇంటి ముందు ముగ్గు వేయాలన్న భయంతో ఉండేవారు. ప్రతి రోజు 10 నుంచి 20 వరకు చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగేవి. ప్రతి సంవత్సరం సుమారు 800 వరకు స్నాచింగ్ ఘటనలు జరిగేవి. కానీ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నేరస్తులపై ఉక్కుపాదం మోపడంతో స్నాచింగ్లు తగ్గిపోయాయి. స్థానికంగా ఉండే స్నాచర్లతో పాటు అంతర్రాష్ట్ర స్నాచర్లపై కఠిన చర్యలు తీసుకుంటూ హైదరాబాద్ వైపు నేరస్తులు చూడాలంటేనే భయపడేలా చేశారు. పరిస్థితిలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ఎక్కడైనా స్నాచింగ్ జరిగిందంటే.. నేడు పోలీస్ శాఖ మొత్తం కదులుతున్నది. 24 గంటల్లో నిందితులను పట్టేస్తున్నారు. ఇలా సంవత్సరానికి 10 స్నాచింగ్ ఘటనలు కంటే తక్కువగా జరుగుతున్నాయి. నిందితులు ఎప్పటికప్పుడు అరెస్ట్ అవుతున్నారు. పోయిన సొత్తు సైతం వెంటనే రికవరీ అవుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో డయల్ 100కు ఫోన్ చేస్తే..స్పందన అంతంతమాత్రంగానే ఉండేది. బాధితులు ఫోన్ చేసినా.. గంటకైనా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేవారు కాదు. స్వరాష్ట్రంలో నేడు డయల్ 100కు ఫోన్ చేస్తే.. 5 నుంచి 8 నిమిషాల్లోనే ఘటనా స్థలికి పోలీసులు వెళ్తున్నారు. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు డయల్ 100 వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో పాటు నేరుగా పోలీసులు ఉపయోగించే మొబైల్ అప్లికేషన్లతో అనుసంధానం చేశారు. అత్యాధునిక వాహనాలను పెట్రోలింగ్ వ్యవస్థకు సమకూర్చారు. దీంతో ప్రజలు ఏ కష్టం వచ్చినా వెంటనే పోలీసులకు చెప్పుకుంటున్నారు. కేవలం నేరమే కాదు.. ప్రజలు ఏ కష్టం వచ్చినా.. డయల్ 100కు ఫోన్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నారు.
2013లో హైదరాబాద్లో బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు కేవలం 64 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. సాంకేతిక పరమైన సంస్కరణలతో ప్రజలకు స్నేహపూర్వకమైన సేవలు అందించాలని పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖకు టెక్నాలజీకి కావాల్సిన నిధులను అందించారు. సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. మరోవైపు ప్రభుత్వం హైదరాబాద్ సిటీ సర్వేలెన్స్, సేఫ్సిటీ ప్రాజెక్ట్ పేరుతో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో (సీఎస్ఆర్ ఫండ్)లో భాగంగా ప్రజాప్రతినిధులు, ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చే ఫండ్స్తో కమ్యూనిటీ కెమెరాలు, ప్రజల ద్వారా ‘నేను సైతం’ పేరుతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేడు అత్యధిక సీసీ కెమెరాలున్న నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. సుమారు 8 లక్షల కెమెరాలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. ప్రతి వెయ్యి మందికి 38 వరకు సీసీ కెమెరాలున్నాయి. అడుగడుగునా.. ఉన్న నిఘా నేత్రంతో చీమ చిటుక్కుమన్నా పోలీసులకు తెలిసిపోతున్నది. దీంతో నేరాలు పూర్తిగా తగ్గడం, ఏదైనా నేరం జరిగితే వెంటనే నేరస్తులు పట్టుపడుతుండటంతో తప్పు చేయాలంటే.. నేరస్తులు భయపడిపోతున్నారు.
రాష్ట్రం ఏర్పడగానే పోలీస్స్టేషన్లలోని వాతావారణం మార్చి..అవసరమైన చోట కొత్త ఠాణాలను ఏర్పాటు చేశారు. పాత పోలీస్స్టేషన్లకు మరమ్మతులు చేశారు. ప్రతి పౌరుడికి ఒకే రకమైన సేవలుండాలని, ఠాణాకు వచ్చే బాధితులకు మేమున్నామనే భరోసాను పోలీసులు కల్పించాలని సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఠాణాల్లో రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని ఠాణాలు ఒకే రకంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీస్ సేవలు ప్రజలు వేగంగా అందించే లక్ష్యంతో 2016లో సైబరాబాద్ను రెండు కమిషనరేట్లుగా విభజించారు. అనంతరం 2023లో ట్రై పోలీస్ కమిషనరేట్లను మెట్రోపాలిటన్ పోలీసింగ్ వ్యవస్థగా మారుస్తూ పునర్ పునర్వ్యవ్థకరించారు. దీంతో 21 కొత్త పోలీస్స్టేషన్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్లో ఏడు జోన్లు, రాచకొండలో నాలుగు, సైబరాబాద్లో ఐదు జోన్లను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, సైబర్క్రైమ్ విషయంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి డీసీపీ స్థాయి అధికారులను నియమించారు.